యాప్నగరం

ప.గో జిల్లాలో మళ్లీ వింత వ్యాధి కలకలం.. కళ్లు తిరిగిపడిపోతున్న జనాలు

కొమిరేపల్లిలో జనాలు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతున్నారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఇలా వరుసగా జనాలు అస్వస్థతకు గురికావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

Samayam Telugu 22 Jan 2021, 9:14 am
పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ వింత వ్యాధి కలకలంరేపింది. దెందలూరు మండలం కొమిరేపల్లిలో జనాలు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతున్నారు.. కొందరికి వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. గ్రామంలో మొత్తం 13మంది అస్వస్థతకు గురయ్యారు.. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇలా వరుసగా జనాలు అస్వస్థతకు గురికావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు రోజుల క్రితం భీమడోలు మండలం పూళ్లలో కూడా ఇదే తరహాలో పలువురు అస్వస్థతకు గురయ్యారు.
Samayam Telugu ప.గో జిల్లా దెందలూరు (File Photo)


ఏలూరు తరహాలో భీమడోలు మండలం పూళ్లలో కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో ఈ నెల 16న పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు రాగా.. ఆ తర్వాత మరికొందరు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో బాధితుల సంఖ్య 28కి చేరింది. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండటంతో ఇళ్లకు పంపించారు. బాధితుల్లో ఇద్దరికి మూర్ఛ రావడంతో పాటు నురగలు కక్కారు. మిగిలిన వారందరూ కళ్లు తిరిగి పడిపోయారు. కొందరికి ఒళ్లు, తలనొప్పులు ఉన్నాయి.

పూళ్లలో బాధితుల సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఐదు వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. ఓ వైద్యుడు, ఏఎన్‌ఎం, ముగ్గురు ఆశా కార్యకర్తలు ఉన్నారు. పూళ్ల పీహెచ్‌సీ, భీమడోలు సీహెచ్‌సీ, జిల్లా ఆసుపత్రిలో కలిపి మొత్తం వంద పడకలు సిద్ధం చేశారు. బాధితుల నుంచి రక్తం, మూత్ర నమూనాలు సేకరించారు. బాధితుల నివాసాల నుంచి నీరు, కూరగాయల నమూనాలనూ సేకరించారు. ఇప్పుడు మళ్లీ దెందలూరులో జనాలు అస్వస్థతకు గురయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.