యాప్నగరం

11 ఏళ్లకే ఉద్యమంలో పాల్గొన్నా.. వెంకయ్యనాయుడు అప్పుడు అలా, ఇప్పుడిలా: ఆర్.నారాయణమూర్తి

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి మరోసారి గళమెత్తారు.

Samayam Telugu 29 Mar 2021, 4:43 pm
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని గ్రామాల్లో జోరుగా తిరుగుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండిలో మత్స్యకార సామాజిక సాంస్కృతిక సమితి నేతృత్వంలో ఆత్మీయ సన్మానం, ‘విశాఖ ఉక్కు పరిరక్షణ-ఆంధ్రుల హక్కు’ అనే అంశంపై ఆదివారం నిర్వహించిన సదస్సుకు ఆర్.నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Samayam Telugu ఆర్.నారాయణమూర్తి


విశాఖ ఉక్కును తమిళనాడుకు కట్టబెట్టెందుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రయత్నిస్తే.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారని నారాయణమూర్తి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆనాడు జరిగిన విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు ఉద్యమంలో 11 ఏళ్ల వయసులోనే తాను పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. 32 మంది యోధుల ప్రాణాలు త్యాగం చేయడం వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడిందని వెల్లడించారు.

ఆనాడు విద్యార్థి నాయకుడిగా ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉక్కు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని ఆర్.నారాయణమూర్తి గుర్తుచేశారు. నాడు చురుగ్గా ఉద్యమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు నేడు మౌనం వహించడం బాధాకరమన్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత వెంకయ్యపై ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విశాఖ ఉక్కు పరిరక్షణలో కార్మికుల పక్షాన నిలబడి కీలకంగా వ్యవహరించాలని కోరారు. గాంధీ నడిచిన నేలకు (పూండి) వచ్చి చెబుతున్నా.. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రం విరమించుకోకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్.నారాయణమూర్తి విరుచుకుపడ్డారు. దేశాన్ని, సంపదను, పరిశ్రమలను, వనరులను ఎవరి ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సభలో ‘ఈ ఊరు మనదిరా.. ఈ ఓడ మనదిరా.. ఈ పల్లె మనదిరా.. ప్రతి పనికి మనంరా..’ అంటూ నారాయణమూర్తి ఉత్సాహంగా నృత్యం చేస్తూ పాడిన పాట అందరినీ అలరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.