ఏపీ మంత్రి రోజా స్టెప్పులతో ఇరగదీశారు. పాత రోజులు గుర్తుకొచ్చాయో ఏమో కానీ.. చామంతి పువ్వా అంటూ తన హిట్ సాంగ్కు డ్యాన్స్ చేశారు. మంత్రి రోజా స్వాతిసోమనాధ్ తో కలిసి డాన్స్ చేశారు. ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి రోజా.. తన డ్యాన్సుతో అలరించారు. శ్రీకాకుళం జిల్లాలోని సాంప్రదాయం గురుకులంలో మూడు రోజులుగా మెగా మ్యూజికల్ ఈవెంట్ జరుగుతోంది. మంత్రి స్టెప్పులతో స్థానికులు, ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ ఉత్సాహపరిచారు. స్వయంగా మంత్రి డాన్స్ చేయటంతో అక్కడున్న వారంతా కేరింతలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎంతో చరిత్ర ఉన్న శ్రీకాకుళం సంప్రదాయ గురుకులంలో హంసధ్వని మెగా ఈవెంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి. సంతోషంగా యావత్ భారత దేశమంతా ఘనంగా నిర్వహిస్తున్న 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో వజ్రోత్సవాలలో భాగంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అధికారుల్ని అభినందించారు. మూడు రోజుల పాటు ధ్యాన, నాట్య, సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేశారని.. గొప్ప సందేశాన్ని ఇక్కడున్న ప్రజలకు అందించారన్నారు. పోటీ ప్రపంచంలో.. మార్కుల కోసం, ర్యాంకుల కోసం పరుగుల తీస్తున్న పిల్లలకి, వారిలో ఒత్తిడిని వారు జయించడానికి ఇలాంటి మంచి కళలు, సంగీతం, నాట్యం ఉపయోగపడతాయన్నారు. క్రీడల వైపు కాస్త ఫోకస్ పెంచి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.