యాప్నగరం

Yuvagalam: కుప్పం నుంచి తొలి అడుగు.. లోకేశ్ పాదయాత్రకు సర్వం సిద్ధం

Yuvagalam: యువత కోసం.. రేపటి భవిత కోసం.. దగాపడ్డ ప్రజల కోసం అంటూ.. టీడీపీ యువనేత నారా లోకేశ్‌ పాదయాత్రకు సిద్ధం అయ్యారు. శుక్రవారం నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్రకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లకు పైగా నడిచేందుకు లోకేశ్ సిద్ధమయ్యారు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకుని.. కుప్పం చేరుకున్న లోకేశ్‌కు టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఉదయం 11 గంటల 3 నిమిషాలకు లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 26 Jan 2023, 7:03 pm

ప్రధానాంశాలు:

  • కుప్పం చేరుకున్న లోకేశ్‌కు ఘనస్వాగతం
  • ఉదయం 11 గంటల 3 నిమిషాలకు పాదయాత్ర షురూ
  • భరోసా ఇచ్చే వేదిక యువగళం అంటున్న లోకేశ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nara Lokesh
నారా లోకేష్
Yuvagalam: రాష్ట్రంలోని యువతకు భరోసా ఇచ్చే వేదిక యువగళం అని.. టీడీపీ యువనేత నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా.. 125కు పైగా నియోజకవర్గాల్లో లోకేశ్‌ పాదయాత్ర సాగనుంది. శుక్రవారం ఉదయం 11 గంటల 3 నిమిషాలకు కుప్పం నియోజకవర్గం పరిధిలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసి.. ముహూర్తానికి లోకేశ్ తొలి అడుగు వేయనున్నారు. సాయంత్రం వరకు కుప్పం చేరుకొని.. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో లోకేశ్‌ (Nara Lokesh) పాల్గొననున్నారు.
లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి హాజరయ్యేందుకు తెలుగుదేశం కేడర్ సిద్ధమయ్యాయి. దాదాపు 50వేల మందికి పైగా కార్యకర్తలు బహిరంగసభకు హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నందమూరి బాలకృష్ణతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా దాదాపు 400 మంది నేతలు బహిరంగ సభ వేదికపై ఆశీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 28న పీఈఎస్‌ కళాశాల నుంచి శాంతిపురంలోని అరిముతనపల్లి వరకు లోకేశ్ పాదయాత్ర సాగనుంది.

ఈనెల 29న శాంతిపురం మండలంలోని అరిముతనపల్లి నుంచి చెల్డిగానిపల్లె వరకు జరగనుంది. కుప్పంలో 29 కిలోమీటర్ల మేర 3 రోజుల పాటు లోకేశ్‌ పాదయాత్ర జరగనుంది. తర్వాత పలమనేరు నియోజకవర్గలోకి వెళ్లనున్న పాదయాత్ర.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తంగా నెల రోజులపాటు సాగనుంది. లోకేశ్‌ 400 రోజుల పాదయాత్ర అనుమతులపై డీజీపీ కార్యాలయం ఇప్పటి వరకు స్పందించకపోగా.. జిల్లా పోలీసులు మాత్రం తొలి 3 రోజులకు మొత్తం 29 షరతులు విధించింది.

కుప్పం నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగనుంది. ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాటు లోకేశ్‌ పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేశారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ పెట్టనున్నారు. ఏడాదికి పైగా సాగే ఈ పాదయాత్రలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలను చుట్టేసేలా ప్లాన్ చేశారు. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాన అజెండాగా సాగే పాదయాత్రలో.. మహిళలు, రైతులు, వివిధ వర్గాల వారి సమస్యలను చర్చించి ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు. యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువగళం వినిపించాలని లోకేశ్‌ నిర్ణయించారు. 96862 96862 నంబర్‌కి మిస్డ్ కాల్ ఇచ్చి యువగళంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.