తెలుగు ప్రజలు తనపై చూపించిన అభిమానం ఎన్నటికీ మరువలేనిదని అన్నారు సినీనటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్. మొన్నటి లోక్సభ ఎన్నికల సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న ఆరోపణలపై ఇటీవల విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఆమె ఎస్సీ కాదని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె పదవి కోల్పోయే ప్రమాదం వచ్చిపడింది. దీనిపై నవనీత్ కౌర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో నవనీత్ కౌర్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుల ధ్రువీకరణ వ్యవహారంలో తనకు సుప్రీంకోర్టులో న్యాయం జరిగినందువల్లే స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. తన పోరాటం శివసేనపై కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. తాను తెలుగు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లని, తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు తనవంతుగా ప్రయత్నిస్తానన్నారు. ఏపీ రైతుల తరుపున లోకసభలో తన గలం వినిపిస్తానని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజల తర్వాత, తెలుగు ప్రజల సమస్యల పరిష్కరంపైనే దృష్టి పెడతానని ఎంపీ నవనీత్ కౌర్ పేర్కొన్నారు.
తెలుగు ప్రజల వల్లే నాకు గుర్తింపు.. ఇకపై వాళ్ల సేవ చేసుకుంటా: ఎంపీ నవనీత్ కౌర్
తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్కౌర్ అన్నారు. తెలుగు ప్రజల వల్లే తనకు పేరొచ్చిందని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu 25 Jun 2021, 12:48 pm
ప్రధానాంశాలు:
- కుల ధ్రువీకరణ పత్రం అంశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది
- అందుకే శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చా
- తిరుమలలో మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్