యాప్నగరం

చిత్తూరు: గొర్రెపై కుక్క దాడి: తల్లీకూతుళ్లకు చిత్రహింసలు.. వీళ్లసలు మనుషులేనా!

చిత్తూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. గొర్రెపై కుక్క దాడి చేసిందంటూ కొందరు వ్యక్తులు మనుషలమనే సంగతి మరిచిపోయి ప్రవర్తించారు.

Samayam Telugu 9 Mar 2021, 11:14 pm
మనుషుల్లో మానవత్వం రోజురోజుకూ చచ్చిపోతోంది. ఈ మాట వాడాలంటే ఎంతో బలమైన కారణం ఉండాలి. సాటి మనుషులపై ప్రేమ చూపించకపోయినా ఫర్వాలేదు గాని, అమానవీయంగా ప్రవర్తించినప్పుడే మానవత్వం అనే పదానికి కళంకం వస్తుంది. ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. గొర్రెపై కుక్క దాడి చేసిందని ఆగ్రహంతో రగిలిపోయి తల్లి, కూతురుపై కొందరు వ్యక్తులు చిత్రహింసలకు గురి చేయడం కలకలం రేపింది.
Samayam Telugu వివరాలు చెబుతున్న బాధితులు


చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో ఈ ఘఠన చోటుచేసుకుంది. బాధితులు, ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెట్టుకు చెందిన ఉత్తన్న, యశోదమ్మలు గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి ఇంటి ఆవరణలో ఉన్న కుక్క పొరుగింట్లో ఉండే ఉప్పర ఓబులేష్, మునెమ్మలకు చెందిన గొర్రెపై దాడి చేసిందంటూ ఉత్తన్న, యశోదమ్మపై దాడిచేసినట్లు బాధితులు తెలిపారు. అడ్డొచ్చిన వారి కుమార్తె ఈశ్వరమ్మ (26)ను సైతం చితకబాదినట్లు పేర్కొన్నారు.

తిరిగి సోమవారం ఉదయం ఇదే విషయమై మళ్లీ గొడవకు దిగి గంగమ్మ ఆలయం వద్ద బలవంతంగా తమ చేతిలో కర్పూరం వెలిగించారని తల్లీకూతుళ్లు వాపోయారు. చేతులు కాలి అరుస్తున్నా వినకుండా చేతిలో మంట పెట్టి తీటగింజరాకు పొడి చల్లి.. చేతిలో వేపాకు కొమ్మలు పెట్టి, నిజం చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మూఢ నమ్మకాలతో పాశవికంగా వేధిస్తూ దారుణంగా వ్యవహరించారని వాపోయారు. వారి నుంచి ఎలాగోలా బయటపడ్డ బాధితులు ముదివేడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.