యాప్నగరం

Chandrababu Naidu మాటలు విని.. ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారు: జగన్

CM Jagan: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అవమానించి.. అన్యాయం చేసిన చంద్రబాబు ఈ రోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని.. ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లెలో జగనన్న విద్యాకానుక నిధులను విడుదల చేసిన జగన్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. వీరిని, వీరు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. నవరత్నాల పాలనతో పేదలకు న్యాయం జరుగుతోందని వివరించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 30 Nov 2022, 5:50 pm

ప్రధానాంశాలు:

  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై జగన్ విమర్శలు
  • వీరికి ఇంకితజ్ఞానం ఇవ్వాలని దేవుడిని కోరుకున్న సీఎం
  • మీ ఇంట్లో మంచి జరిగితే తోడుగా ఉండాలని స్పష్టం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jagan speaking on stage
వేదికపై మాట్లాడుతున్న జగన్
CM Jagan: నవరత్నాల పాలనతో పేదలకు ప్రభుత్వం మంచి చేస్తుంటే.. పెత్తాందార్లు తట్టుకోలేకపోతున్నారని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ అంశంపైనా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ బటన్‌ నొక్కి ప్రజలకు మంచి జరిగితే.. వీళ్లకు పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. బటన్‌ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అవుతుందట.. ఇదే రాష్ట్రంలో వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమెరికా అని దుష్ప్రచారం చేస్తూ.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. వీరికి జ్ఞానం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను అని జగన్ విమర్శలు గుప్పించారు. మదనపల్లెలో జగనన్న విద్యాకానుక నిధులను విడుదల చేసిన జగన్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
'వ్యవసాయం దండగని చంద్రబాబు రైతులను మోసం చేశారు. ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. పిల్లలకు అన్యాయం చేసిన చంద్రబాబు.. ఈరోజు విద్యారంగం గురించి మాట్లాడుతున్నారు. అక్కచెల్లెమ్మలను దగా చేసిన చంద్రబాబు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అవమానించి.. అన్యాయం చేసిన చంద్రబాబు ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్లు లెక్చర్స్‌ దంచుతుంటే.. రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా.. ఇదేం ఖర్మరా బాబూ.. అని అనుకుంటున్నారు' అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

'కుళ్లిపోయిన పెత్తందార్ల మనస్తత్వాలు ఉన్న ఇలాంటి బాబులు, దత్తపుత్రులు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా అన్నదే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండండి. ఇవాళ యుద్ధం చేస్తున్నది మంచి వాళ్లతో కాదు. రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నాం. చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని దయచేసి గుర్తుపెట్టుకోండి' అని ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సూచించారు.

'ఇంతకు ముందు ఇలాంటి ప్రభుత్వమే ఉండేది. ఇంతకు ముందు కూడా రాష్ట్రానికి ఒక బడ్జెట్‌ ఉండేది. మరి అప్పుడు పాలకులు ఎందుకు ఈ మాదిరిగా నేరుగా బటన్‌నొక్కి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బుల వచ్చేలా మంచి చేయలేకపోయారో ఆలోచన చేయండి. కారణం.. అప్పుడంతా కూడా ఒక గజదొంగల ముఠా ఉండేది. ఆ ముఠాకు దుష్టచతుష్టయం అనే పేరు ఉండేది. చంద్రబాబు.. ఈ దుష్ట చతుష్టయం, గజదొంగల ముఠా.. వీరు రాష్ట్రాన్ని దోచుకో.. తినుకో.. పంచుకో అన్న మాదిరిగా దోచుకుతిన్నారు' అని జగన్ ఆరోపించారు.

'ఆ రోజు బటన్లు లేవు. నొక్కే వారు లేరు. ప్రజలకు నేరుగా మంచి చేయాలనే ఆలోచనలు లేవు. వారు చేసేవి దౌర్భాగ్యపు రాజకీయాలు అయినా ఎవరూ రాయరు. ఎవరు చూపించరు. అలాంటి దౌర్భగ్యా రాజకీయాలతో ఈరోజు యుద్ధం చేస్తున్నాం. ఈ రోజు మీ బిడ్డ పత్రికలను, టీవీ చానల్స్‌ను నమ్ముకోవడం లేదు. దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. దేవుడిని నమ్ముకున్నాను. ఆ తరువాత మిమ్మల్ని నమ్ముకున్నాను. మీ బిడ్డకు మీతోనే పొత్తు. మీ బిడ్డకు నిజాయితీ తోడుగా ఉంది. ఏదైతే మీ బిడ్డ చెబుతాడో.. అదే చేసి చూపిస్తాడు' అని సీఎం జగన్ వివరించారు.

'ఎన్నికలప్పుడు మేనిఫెస్టో విడుదల చేశాం. దాన్ని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాను. ఇప్పటికే 98 శాతం హామీలను పూర్తిగా అమలు చేసిన తరువాత.. ప్రతి ఎమ్మెల్యే మీ ఇంటి గడప వద్దకు వచ్చి ఈ మంచి మీకు జరిగిందా? లేదా అని మీ ఆశీస్సులు తీసుకుంటున్నారు. తేడా గమనించమని కోరుతున్నాను. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసేవారు. ఎవరు ఇలా ఎందుకు చేశావని రాసేవారు ఉండేవారు లేదు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకువచ్చింది మీ బిడ్డే' అని జగన్ వ్యాఖ్యానించారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.