యాప్నగరం

26 ఏనుగులు గుంపుగా ప్రత్యక్షం.. హడలిపోయిన ప్రజలు, ఫారెస్ట్ సిబ్బందికి గాయాలు

చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. పలమనేరు పట్టణ సమీపంలోని ప్రాంతాల్లో యథేచ్ఛగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. వాటిని తరిమికొట్టే ప్రయత్నంలో ఫారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి.

Samayam Telugu 24 Jun 2021, 8:37 am

ప్రధానాంశాలు:

చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగుల గుంపు
ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ సంచారం
అడవిలోకి మళ్లించేందుకు రోజంతా కష్టపడిన ఫారెస్ట్ సిబ్బంది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఏనుగుల గుంపు హల్‌చల్
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఏకంగా 26 ఏనుగుల గుంపు పలమనేరు పట్టణ సమీపంలో సంచరించింది. ఏనుగుల ఘీంకారాలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని వాటిని అడవిలోకి పంపేందుకు నానా తంటాలు పడ్డారు.
ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు అటవీ అధికారులు బాణాసంచా కాలుస్తున్న సమయంలో ట్రాకర్‌ హరిబాబు చేతిలో ఓ పటాసు పేలి ఆయన కుడిచేతి మూడు వేళ్లు తెగిపోయాయి. మరో ట్రాకర్‌ స్వల్పంగా గాయపడ్డాడు. మరోవైపు ఏనుగుల గుంపు అడ్డొచ్చిన వస్తువులను తొక్కేస్తూ బొమ్మదొడ్డి, బోడిరెడ్డిపల్లె గ్రామాల మీదుగా కదిలాయి.

ఈ క్రమంలోనే బోడిరెడ్డిపల్లె రైతుకు చెందిన ఓ పాడి ఆవును ఏనుగు తొండంతో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. దీంతో ఆ సమీపంలోని రైతులు కట్టేసిన పశువులన్నింటినీ వదిలేసి, పొలాల్లోకి తరిమేశారు. ఆ తర్వాత ఏనుగుల గుంపు బొమ్మదొడ్డి చెరువులోకి దిగి జలకాటలు ఆడాయి. చివరికి ఫారెస్ట్ అధికారులు వాటిని సాయంత్రం 5 గంటల సమయంలో అడవిలోకి మళ్లించగలిగారు. పలమనేరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటాయని, తిరిగి వాటిని పంపించడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.