యాప్నగరం

Yuva Galam: నారా లోకేష్‌‌కు ఝలక్.. కేసు నమోదు

Nara Lokesh Police Case నమోదైంది. బంగారు పాళ్యంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. బంగారుపాళ్యం ఎస్ఐ ఫిర్యాదుతో పోలీసులు లోకేష్ సహా ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు టీడీపీ ఈ కేసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లోకేష్ పాదయాత్ర చేసినా, మాట్లాడినా, సభ పెట్టినా వైఎస్సార్‌సీపీలో వణుకు పుడుతోందన్నారు. అక్రమ కేసులతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని నేతలు మండిపడుతున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 4 Feb 2023, 12:31 pm
Nara Lokesh Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై కేసు నమోదైంది. బంగారుపాళ్యంలో శుక్రవారం నాటి పరిణామాల తర్వాత లోకేష్ సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. లోకేష్ సహా పలువురిపై బంగారుపాళ్యం ఎస్ఐ మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు చేశారు. లోకేష్తో పాటు మాజీ మంత్రి అమర్నాథ్‍రెడ్డి (Amarnath Reddy), దీపక్ రెడ్డి, పులివర్తి నాని (Pulivarthi Nani), ఎన్.పి.జయప్రకాష్, జగదీష్‌పై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
Samayam Telugu Nara Lokesh Padayatra


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా ఆరుగురు టీడీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఇదో పిరికిపంద చర్యని.. నారా లోకేష్ అడుగు బయటపెట్టినా, మైక్ పట్టుకున్నా , బహిరంగ సభ పెట్టినా వైఎస్సార్‌సీపీ నేతల్లో వణుకు పుడుతోందన్నారు. జగన్ అరాచక పాలన, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను యువగళం పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్నారని.. జగన్ పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం నేరంగా మారిందన్నారు.

పాలన చేతకాక ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు అచ్చెన్న. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రతి పక్షాలను అణచి వేస్తున్నారని.. నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాని జీవో-01ను అడ్డుపెట్టుకుని కొంతమంది పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. పలమనేరులో బహిరంగ సభకు వేలాదిగా జనం పోటెత్తడం చూసి జగన్‌కు గుండెపోటు వచ్చినంత పని అయ్యిందన్నారు. వెంటనే డిఎస్పీతో ప్రచార రథాన్ని సీజ్ చేయాలని ఆదేశించారని.. తాటాకు చప్పుళ్లకు భయపడం అన్నారు. ఇటువంటి తలా తోకా లేని కేసులు టీడీపీ నేతల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేవని.. యువగళం పాదయాత్ర ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మా పోరాటం ఆగదన్నారు.

మరోవైపు నారా లోకేష్ పాదయాత్ర (Nara Lokesh Padaytra) కు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారనడం సరికాదన్నారు అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశం పోలీసులకు లేదని.. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం విధులను నిర్వర్తిస్తున్నామని తెలిపారు. పాదయాత్ర సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా వ్యవహరిస్తున్నామన్నారు. ప్రముఖుల స్థాయిని బట్టి బందోబస్తును కల్పిస్తామని.. లోకేష్‌ పాదయాత్రకు కూడా అదే స్థాయి బందోబస్తును కల్పిస్తున్నామన్నారు.

శుక్రవారం బంగారుపాళ్యంలో లోకేష్ పాదయాత్రలో మూడు ప్రచార వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. పాదయాత్రలో మైకులు వాడకూడదంటూ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో లోకేష్ ఓ భవనంపైకి వెళ్లి ప్రసంగించారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం.. ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఈ పరిణామాల తర్వాత లోకేష్ సహా టీడీపీ నేతలపై కేసు నమోదైంది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.