యాప్నగరం

తిరుమల ఆలయంలో శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం.. ప్రత్యేకతలివే

Tirumala Sri Bhoga Srinivasa Murty Sahasra Kalashabishekam ఈ నెల 28న ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగనున్నాయి. ప్రతి ఏటా శ్రీభోగ శ్రీనివాసమూర్తికి ఈ సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. మరోవైపు ఈ నెల 24న నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం. మే 31 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు .

Authored byతిరుమల బాబు | Samayam Telugu 23 May 2023, 1:44 pm

ప్రధానాంశాలు:

  • ఈ నెల 28న భోగ శ్రీనివాసమూర్తికి సహస్రకలశాభిషేకం
  • ఉదయం 6 గంటల నుంచి సహస్రకలశాభిషేకం ఉంటుంది
  • శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని కూడా పిలుస్తారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tirumala  Sahasra Kalashabishekam
తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి మే 28వ తేదీన ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరుగనుంది. 17 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంనాడు శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి.
పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం శ్రీవారిని 78,349మంది భక్తులు దర్శించుకున్నారు. 39,634 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.. హుండీకి రూ. 4.56 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. SSD టోకెన్లు లేని సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 24న ఉదయం 6-30గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. మే 31 నుంచి జూన్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం మ‌ధ్యాహ్నం 1.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలలో భాగంగా సోమ‌వారం విశేష హోమాలు నిర్వ‌హించారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు యాగ‌శాల‌లో హోమగుండాల‌ను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, కుంభారాధ‌న‌, పంచగవ్యారాధన నిర్వ‌హించారు. త‌రువాత ఉక్త హోమాలు, పంచసూక్త హోమాలు జ‌రిగాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.