యాప్నగరం

తిరుమల: శ్రీవారికి తిరిగి ప్రారంభమైన సుప్రభాత సేవ.. భక్తులకు అనుమతి

తిరుమల శ్రీవారికి నెల రోజుల పాటు నిలిచిపోయిన సుప్రభాత సేవలను తిరిగి టీటీడీ ప్రారంభించింది. ధనుర్మాసంలో స్వామివారికి సుప్రభాత సేవలకు బదులు తిరుప్పావై పారాయణం చేయడం ఆనవాయితీ.

Samayam Telugu 15 Jan 2021, 7:23 am
ధనుర్మాసం ముగియడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం నుంచి తిరిగి సుప్రభాత సేవలు ప్రారంభమయ్యాయి. వేకువజామున 3 గంటలకు సుప్రభాత పఠనం సమయంలో భక్తులనూ అనుమతించారు. నేడు శ్రీవారి ఆలయంలో గోదాదేవి పరిణయోత్సవాలు జరగనున్నాయి. కాగా, ధనుర్మాసం నేపథ్యంలో శ్రీవారికి సుప్రభాత సేవలు డిసెంబరు 16 నుంచి నిలిచిపోయిన విషయం తెలిసిందే. ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు శ్రీవారికి తిరుప్పావై పారాయణం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు.
Samayam Telugu తిరుమల శ్రీవారి ఆలయం


జనవరి 14న ధనుర్మాసం పూర్తికావడంతో గోదా కళ్యాణం నిర్వహించారు. ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరిగాయి. శ్రీవారి ఆలయంలో నెలరోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో గోదాదేవి రచించిన 30 పాశురాలను అర్చకులు రోజుకొకటి చొప్పున నివేదించారు. ఈ సందర్భంగా భోగశ్రీనివాసమూర్తికి బదులు శ్రీకృష్ణస్వామికి ఏకాంతసేవ నిర్వహించారు.

ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురణాల్లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.