యాప్నగరం

YSRCP ఎమ్మెల్యే మంచి మనసు.. అమర జవాన్ కుటుంబానికి అండగా భేషైన నిర్ణయం!

జమ్మూ కశ్మీర్‌లో చలి తీవ్రత తట్టుకోలేక అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలిన జవాన్ రెడ్డప్ప నాయుడు భౌతిక కాయం ఆయన సొంతూరు గడ్డకిందపల్లికి చేరుకుంది.

Samayam Telugu 5 Jan 2021, 12:15 pm
జమ్మూ కశ్మీర్‌లో ప్రాణాలు వదిలిన తెలుగు జవాన్ రెడ్డప్ప నాయుడు (38) మృతదేహం ఆయన స్వస్థలమైన చంద్రగిరి నియోజకవర్గమైన పనపాకం పంచాయతీలోని గడ్డ కిందపల్లికి చేరుకుంది. మంగళవారం ఉదయం ఆయన మృతదేహం స్వస్థలానికి చేరుకోగా.. పార్థీవ దేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అమర జవాన్ ఇంటికి వెళ్లిన.. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. జవాన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
Samayam Telugu chandragiri jawan


రెడ్డప్ప నాయుడు కుటుంబ సభ్యులను ఓదార్చిన చెవిరెడ్డి వారికి ధైర్యం చెప్పారు. రెడ్డప్ప కుటుంబానికి అండగా ఉంటామని, అన్ని విధాల ఆదుకుంటామని, అందరూ ఆ కుటుంబానికి, సోదరికి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

జవాన్ రెడ్డప్ప కుటుంబానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యక్తిగతంగా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. పిల్లల చదువులకు సహాయ సహకారం అందిస్తానని జవాన్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రెడ్డప్ప నాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

జమ్మూ కశ్మీర్‌లో విధి నిర్వహణలో ఉన్న రెడ్డప్ప నాయుడు.. చలి తీవ్రత కారణంగా అస్వస్థతకు గురై.. అనంతరం ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగకు సెలవుపై వస్తానన్న రెడ్డప్ప విగత జీవిగా సొంతూరు రావడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెడ్డప్పకు భార్య రెడ్డమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.