యాప్నగరం

సీఎం జగన్ చంద్రగిరి పర్యటన.. రూ.52 వేలు ఫైన్ కట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

CM Jagan ఇటీవల చంద్రగిరి పర్యటన సందర్భంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూ.52 వేల జరిమానా కట్టారు. నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు ముందస్తు పర్మిషన్లు తీసుకున్న ఆయన.. అందుకోసం చలాన్లు కట్టారు. ఏడాది క్రితం చంద్రగిరి నియోజకవర్గాన్ని ఫ్లెక్సీ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన సమయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఆయన నిబద్ధతతో వ్యవహరించి సంబంధింత విభాగాలకు జరిమానా చెల్లించారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 26 Jun 2022, 10:55 pm

ప్రధానాంశాలు:

  • ఇటీవల చంద్రగిరిలో సీఎం జగన్ పర్యటన
  • ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
  • చలాన్లు చెల్లించి అనుమతులు పొందిన ఎమ్మెల్యే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jagan With Chevireddy
Jagan With Chevireddy
చంద్రగిరిని ఫ్లెక్సీ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. ఇటీవల సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు గానూ రూ.52,189 జరిమానా చెల్లించారు. వివరాల్లోకి వెళ్తే.. 2021 మే నెలలో చంద్రగిరి పంచాయతీలో ఫ్లెక్సీలు చింపేసిన ఘటన వివాదానికి దారి తీసింది. కొందరు తీవ్ర గాయాలై హాస్పిటల్ పాలయ్యారు. పోలీసు స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఫ్లెక్సీల ఏర్పాటుపై నిషేధం విధించారు. ఎలాంటి కార్యక్రమాలకూ ఫ్లెక్సీలు కట్టకూడదని తీర్మానించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా ఫ్లెక్సీ కట్టాల్సి వస్తే.. సామాన్యుడైనా.. ప్రజాపతినిధి అయినా సరే.. జరిమానా చెల్లించాలనే నిబంధన విధించారు. అంతేకాదు ఆర్ అండ్ బీ అనుమతులు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసుల అనుమతులు, ఫ్లెక్సీల ఏర్పాటుకు పంచాయతీల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనలు విధించారు.
చంద్రగిరిని ఫ్లెక్సీ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడంతో ఏడాదిపాటు ఇక్కడ రాజకీయ పార్టీలు ఎలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయలేదు. బర్త్ డే ఫంక్షన్లు, శుభకార్యాల కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా.. ఆయా పంచాయతీలకు చలానాలు చెల్లించడంతోపాటు.. వాటిని అదేరోజు తొలగించి అధికారులకు సహకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23న దైవ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రగిరి నియోజకవర్గానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనుమతుల కోసం ముందుగా ఎంపీడీఓ, పోలీసు, ఆర్అండ్ బీ, రెవెన్యూ అధికారులకు అర్జీ సమర్పించారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు ఆయా విభాగాల నుంచి అనుమతులు మంజూరయ్యాయి.

ఒక్కరోజు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం రూ.52,189లను చెల్లించారు. సీఎం పర్యటన ముగిసిన గంటలోపే ఈ ఫ్లెక్సీలను తొలగించారు. సీఎం కార్యక్రమానికి ఫ్లెక్సీలు కట్టినందుకు రూ.52 వేలకుపైగా చలానా చెల్లించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి నిబద్దతను నియోజకవర్గ ప్రజలు కొనియాడుతున్నారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.