యాప్నగరం

YSRCP ఎమ్మెల్యే, వంగవీటి రాధా వర్గాల మధ్య ఘర్షణ.. హైవే మీద రచ్చ, చివరకు..

హనుమాన్ జంక్షన్‌లో వంగవీటి రాధా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. తమ అనుచరులకు నచ్చజెప్పడం కోసం చివరకు ఇద్దరు నేతలు ఒకే కార్లో వెళ్లాల్సి వచ్చింది.

Samayam Telugu 9 Jan 2021, 7:29 pm
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి.. టీడీపీ నేత వంగవీటి రాధా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం హనుమాన్ జంక్షన్ ప్రాంతం ఇందుకు వేదికైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా కలకత్తా - చెన్నై జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి.. వంగవీటి రాధ తమ తమ వాహనాల్లో ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళుతున్నారు.
Samayam Telugu vangaveeti radha-abhay chowdary
Image: FB


హనుమాన్ జంక్షన్ దాటిన అనంతరం వాహనాలు ముందుకు వెళ్లే క్రమంలో.. ఎమ్మెల్యే అనుచరులకు చెందిన కొన్ని వాహనాలు ముందుకు వెళ్లాయి. ఎమ్మెల్యే వాహనం మధ్యలో ఉండిపోయింది. దీంతో ఆయన అనుచరులు.. రాధ అనుచరులను ప్రక్కకు తప్పుకోవాలని కేకలు వేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇరు వర్గాలకు చెందిన వారు జాతీయ రహదారిపై వాహనాలను నిలిపివేసి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేసి అక్కడి నుంచి తరలించారు.
రాధా అనుచరులు తమపై దాడి చేశారని ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. కాగా ఇరువర్గాలను శాంతింపజేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధా ఒకే వాహనంలో అక్కడ నుంచి బయల్దేరి వెళ్లారు.

వంగవీటి అనుచరుల దాడిలో తమ వర్గానికి చెందిన ఇద్దరు గాయపడ్డారని అబ్బయ్య చౌదరి అనుచరులు ఆరోపిస్తున్నారు. దీంతో ఫిర్యాదు చేసుకోవడం కోసం ఇరు వర్గాలు వీరవల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తకర వాతావరణం ఏర్పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.