యాప్నగరం

రూ.60 పెంచి, రూ.5 తగ్గిస్తారా.. పెట్రో రేట్లపై ఈ తేడా చూడండి.. సీనియర్ నేత సంచలన కామెంట్స్!

కేంద్ర ప్రభుత్వ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Samayam Telugu 8 Nov 2021, 3:03 pm
పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ ధరలు, పన్నుల పెంపుపై కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చాక పెట్రోల్, డీజిల్‌ ధరల వ్యత్యాసాన్ని రామకృష్ణ వివరించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


కొద్ది నెలల్లోనే పెట్రో ధరలు ఏకంగా రూ. 60 పెంచి.. ఇప్పుడు కేవలం రూ.5 తగ్గించి గొప్పగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని రామకృష్ణ మండిపడ్డారు. ఈ నెల 14న తిరుపతి వస్తున్న హోం మంత్రి అమిత్‌ షాకు పెట్రోల్‌ ధరలపై నిరసన తెలుపుతామని వెల్లడించారు. ఏపీలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పని తీరు సరిగా లేదని ఆరోపించారు.

ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. తిరుపతికి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చి ఆమలు చేయలేదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచి.. రూ. 5 తగ్గిస్తారా? అంటూ మండిపడ్డారు. అదానీ పోర్టు నుంచి దేశవ్యాప్తంగా మత్తుమందు రవాణా అవుతోందని.. దీనిపై మోదీ ఎందుకు మాట్లాడరని నిలదీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.