యాప్నగరం

ఆ ఘనత జగన్ మోహన్ రెడ్డిదే.. ప్రజల జీవితాల్లో చీకట్లు: మాజీ మంత్రి

రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. కోతలు, వాతలతో జగన్ రెడ్డి ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారని అన్నారు.

Samayam Telugu 3 Apr 2022, 8:30 am
గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఏడుసార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చరిత్ర సీఎం జగన్ మోహన్ రెడ్డిదేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామం కృష్ణానది ఒడ్డున కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను ఉగాది పండుగ చేసుకోనీయకుండా జగన్ రెడ్డి వారి జీవితాల్లో చీకట్లు నింపారని మండిపడ్డారు.
Samayam Telugu మాజీ మంత్రి దేవినేని ఉమా


ఆనందోత్సాహాలతో ఉగాది పండుగ జరుపుకోవాల్సిన తరుణంలో రాష్ట్రంలో ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితిని కల్పించారని దేవినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోతలు, వాతలతో జగన్ రెడ్డి ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారని అన్నారు. మళ్లీ గ్రామాల్లో లాంతర్లు, కిరోసిన్ బుడ్డీలు వెతుక్కునే పరిస్థతి వచ్చిందని.. టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి కొవ్వొత్తి, అగ్గిపెట్టెలను పంపిణీ చేస్తామన్నారు.

విద్యుత్ ఛార్జీల పెంపుతో బాదుడు కార్యక్రమం మొదలు పెట్టారని మాజీ మంత్రి విమర్శించారు. సామాన్య ప్రజలు ఇంట్లో ఫ్యాన్ వేసుకోవడానికి కూడా భయపడుతున్నారని అన్నారు. సోలార్ పవర్, విండ్ పవర్‌ను నాశనం చేశారని.. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఒక్కసారి కరెంట్ ఛార్జీలు పెంచలేదన్నారు. తమ హయాంలో రాష్ట్రంలో ఒక్క గంట కరెంట్ తీయలేదని చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపును రద్దు చేసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. వారం రోజులపాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన కొవ్వొత్తులతో నిరసన చేపట్టాలని నిర్ణయించామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.