యాప్నగరం

భార్యకు కిడ్నీ వ్యాధి, తండ్రీకూతురు షాకింగ్ నిర్ణయం.. కంటతడి పెట్టిస్తున్న లేఖ!

విజయవాడ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తండ్రి, కూతురు అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు.

Samayam Telugu 10 Apr 2021, 7:20 pm
విజయవాడ నగర పరిధిలోని శ్రీనగర్‌ కాలనీ రెండో లైన్‌లో విషాదం చోటుచేసుకుంది. భార్య అనారోగ్యానికి గురికావడం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో మనస్తాపంతో జగాని రవి (40), తన పదేళ్ల కుమార్తెతో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, రవి రాసిన ఆత్మహత్య లేఖ కంటతడి పెట్టిస్తోంది. మరణించిన తర్వాత తమ అవయవాలను భార్య భరణికి ఇవ్వాలని ఆత్మహత్య లేఖలో రవి పేర్కొన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


గత కొంత కాలంగా జగాని రవి భార్య భరణి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన రవి.. రెండేళ్ల క్రితం ఉద్యోగం మానేసి ఇంటి దగ్గరే ఉంటున్నాడని బంధువులు తెలిపారు. అయితే భార్య కిడ్నీ వ్యాధికి గురికావడం, చిన్నప్పటి నుంచి పెంచిన నానమ్మ ఇటీవలే మృతి చెందటం, ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో రవి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.


అయితే, మృతుడు రవి కాళ్లు, చేతులు కట్టేయడం, ముఖానికి గుడ్డ కట్టి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, భయపడకుండా ఉండేందుకే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కాళ్లు, చేతులు కట్టేసుకుని, నోటికి ప్లాస్టర్ వేసుకొని, కళ్ళకు గంతలు కట్టుకుని తండ్రి కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ విషయం తెలుసుకున్న సత్యనారాయణపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. వీరు నిజంగా ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.