యాప్నగరం

అమరావతి ఇష్యూ.. సీఎస్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసిన జగన్ సర్కారు

అమరావతి ప్రాంతంలోని నిర్మాణాల విషయమై అధ్యయనం కోసం జగన్ సర్కారు కమిటీని ఏర్పాటు చేసింది. 9 మంది సభ్యులున్న ఈ కమిటీకి చీఫ్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు.

Samayam Telugu 11 Feb 2021, 9:46 pm
అమరావతి విషయంలో ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో 9 మంది అధికారులు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీలో శాసనసభ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఆర్‌డీఏ కమిషనర్‌, సీఎం ముఖ్య సలహాదారు సభ్యులుగా వ్యవహరిస్తారు.
Samayam Telugu amaravati buildings


అమరావతి పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాలు, బంగ్లాలు తదితరాల నిర్మాణంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేయాలా.. లేదంటే ఖజానాపై భారం తగ్గించడం కోసం ఇంకేమైనా చేయాలా..? అనే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఈ కమిటీ సూచనలు ఉపకరించనున్నాయి. కమిటీ అవసరమని పేర్కొన్న భవనాల నిర్మాణాలను పూర్తి చేసి.. మిగతా వాటిని పక్కనబెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అమరావతికి వెళ్లే కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలని సీఎం జగన్ ఇటీవలే ఆదేశించారు. ఇందుకు రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకమైన కరకట్ట రోడ్డును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును మెయిన్ రోడ్డుతో అనుసంధానం చేసే పనులను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు.

టీడీపీ హయాంలో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి.. రైతుల దగ్గర్నుంచి వేలాది ఎకరాల భూములను సేకరించిన సంగతి తెలిసిందే. ఈ భూముల్లో చంద్రబాబు సర్కారు సచివాలయం సహా కొన్ని భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు.. మూడు రాజధానుల ప్రకటన చేయడంతో.. అమరావతిలో భవనాల నిర్మాణం నిలిచిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.