యాప్నగరం

నమస్తే మేడం అంటూ ఎస్సై వెటకారం.! వైసీపీ మహిళా ఎంపీ అసహనం

వైసీపీ మహిళా ఎంపీకి పదేపదే నమస్తే మేడం అంటూ తీవ్ర అసహనానికి గురిచేశాడో ఎస్సై. ఎంపీ మాట్లాడుతుంటే ఫోన్ వచ్చినట్టు బయటికి వెళ్లిపోయి అవమానించాడంటూ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.

Samayam Telugu 24 Dec 2020, 3:12 pm
నమస్తే మేడం.. నమస్తే మేడం.. అంటూ ఓ ఎస్సై వెటకారం అధికార పార్టీ ఎంపీకి ఆగ్రహం తెప్పించింది. ఉద్దేశపూర్వకంగానే ఎస్సై అలా ప్రవర్తిస్తున్నాడని గ్రహించిన ఎంపీ సీరియస్ అవడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. అయితే కోపంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు మాత్రం గిరిజన ఎంపీ అనే చులకన భావనతోనే ఎస్సై అతిగా ప్రవర్తించాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నం జిల్లాలో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ysrcp


ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు అరకు ఎంపీ జి.మాధవి హుకుంపేట మండలంలో పర్యటించారు. తొలుత చీడిపుట్టు గ్రామంలోని బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. షెడ్యూల్‌లో భాగంగా మరో కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి కార్యక్రమానికి వచ్చిన హుకుంపేట ఎస్సై నజీర్ ‘నమస్తే మేడం.. నేను హుకుంపేట ఎస్సై నజీర్‌’ని అంటూ పలుమార్లు పలకరించాడు.

రెండుసార్లు సానుకూలంగా స్పందించిన ఎంపీ మాధవి మూడోసారి కూడా ఎస్సై నమస్తే మేడం.. నేను హుకుంపేట ఎస్సై నజీర్‌ని అంటూ పలకరించడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి ఎస్సై వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఎంపీ మాట్లాడుతున్నా ఫోన్ వచ్చినట్లు బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. అదంతా చూస్తూ ఉన్న వైసీపీ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. గిరిజన ఎంపీ అనే చులకన భావంతోనే ఎస్సై అలా ప్రవర్తించాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న పాడేరు సీఐ వెంటనే హుకుంపేట వెళ్లి ఎస్సై నజీర్‌ని మందలించినట్లు తెలిసింది. తనతో అవమానకర రీతిలో వ్యవహరించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎంపీ మాధవి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఐ సర్దిచెప్పి సమస్యను సద్దుమణిగేలా చేశారు. అయితే ఎస్సై అనుచిత ప్రవర్తనకు సీఎం జగన్ బర్త్‌ డే వేడుకల రోజు జరిగిన గొడవే కారణంగా తెలుస్తోంది. హుకుంపేటలో జగన్ బర్త్‌ డే వేడుకలు నిర్వహించేందుకు పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు ఏర్పాట్లు చేసుకుంటుండగా అనుమతుల్లేవంటూ ఎస్సై అభ్యంతరం చెప్పినట్లు సమాచారం.

ఎంపీ, ఎమ్మెల్యే కూడా వస్తున్నందున ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు సమాధానమిచ్చారు. అదే విషయమై ఎస్సై, నిర్వాహకుల మధ్య వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. సీఎం బర్త్‌ డే వేడుకల సమయంలో ఎస్సై ఇబ్బంది పెట్టాడని పలువురు ఎంపీ మాధవి దృష్టికి తీసుకెళ్లడంతో తాను పిలిపించి మాట్లాడతానని సర్దిచెప్పి పంపించారు. ఎస్సై నజీర్‌ని పిలిపించిన ఎంపీ.. హుకుంపేట పర్యటనకు వచ్చినా ఎప్పుడూ కనిపించలేదని.. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు.

అది మనసులో పెట్టుకునే ఎస్సై హుకుంపేట పర్యటనకు వచ్చిన ఎంపీతో అవమానకరరీతిలో వ్యవహరించారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. నమస్తే మేడం, నమస్తే మేడం అంటూ వెటకారం ప్రదర్శించాడని.. అదేంటని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయాడని.. కేవలం గిరిజన ఎంపీ అనే చిన్నచూపుతోనే ఎస్సై హద్దులు దాటి ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ కూడా తీవ్ర అసహనానికి గురవడంతో ఈ విషయంపై ఎటు దారితీస్తుందోనని వేచిచూస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.