యాప్నగరం

మా నాన్న చనిపోయింది కరోనాతో కాదు, కారణం ఇదే.. సబ్బం హరి కుమారుడు క్లారిటీ!

అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. అయితే, మరణానికి సంబంధించిన విషయాలను ఆయన కుమారుడు వివరించారు.

Samayam Telugu 3 May 2021, 10:43 pm
విశాఖపట్నం మాజీ మేయర్, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి (68) సోమవారం మధ్యాహ్నం 1.22 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు వెంకట్‌ వెల్లడించారు. తన తండ్రి చనిపోయింది కరోనా వైరస్ వల్ల కాదని స్పష్టం చేశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ వల్లే తన తండ్రి ప్రాణాలు విడిచారని తెలిపారు. చికిత్స తర్వాత ఆయనకు కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చిందని వివరించారు. మంగళవారం ఉదయం 9 గంటల తర్వాత సబ్బం హరికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
Samayam Telugu సబ్బం హరి మరణంపై ఆయన కుమారుడు క్లారిటీ


ఇక, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిత్యం తన తండ్రి సబ్బం హరి ఆరోగ్యంపై వివరాలు అడిగేవారని వెంకట్ భావోద్వేగం చెందారు. ఈ కష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ వెంకట్‌ కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్‌ ప్రబలుతున్న వేళ అంత్యక్రియలకు ఎవరూ రావొద్దని ప్రజలను కోరారు.

మరోవైపు, సబ్బం హరి మరణంపై హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ అభివృద్ధికి సబ్బం హరి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా, ఇటీవలే కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన సబ్బం హరి విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ప్రాణాపాయ స్థితిలో పోరాడిన సబ్బం హరి.. చివరికి, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ వల్లే తన తండ్రి ప్రాణాలు విడిచారని వెంకట్ క్లారిటీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.