యాప్నగరం

విశాఖవాసులకు శుభవార్త.. ఓకే చెప్పిన కేంద్రం

పూడిమడక దగ్గర సుమారు వెయ్యి ఎకరాల్లో స్టీల్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో వివిధ శాఖల అధికారులతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి.

Samayam Telugu 14 Jan 2021, 8:29 am
విశాఖలో భారీ స్టీల్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. తయారీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి అవకాశాలను పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పూడిమడక దగ్గర సుమారు వెయ్యి ఎకరాల్లో స్టీల్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉత్పత్తి ఆధారిత రాయితీలు (పీఎల్‌ఐ) స్కీం కింద కీలకమైన పదిరంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), ఏపీఐఐసీ, పరిశ్రమలశాఖ అధికారుల బృందం ఢిల్లీలో వివిధ శాఖల అధికారులతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి.
Samayam Telugu విశాఖపట్నం


స్టీల్‌ క్లస్టర్‌ ఏర్పాటు ప్రతిపాదనలను ఉక్కు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శికి వివరించినట్లు రాష్ట్ర పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. కేంద్రం చేపడుతున్న పూర్ణోదయ ప్రాజెక్టు కింద పరిశ్రమలశాఖ ప్రతిపాదించిన క్లస్టర్‌ ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఏపీ నుంచి ఎగుమతులు రెట్టింపవుతాయని.. దీనికి అనుగుణంగా ప్రభుత్వం సప్లై చైన్, ఎగుమతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతపురంలో అపెరల్‌ పార్కు, నగరిలో టెక్స్‌టైల్‌ పార్కులతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆటో, ఏరోస్పేస్, ఇంజనీరింగ్‌ వంటి పదిరంగాల్లో థీమ్‌ ఆధారిత పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పారిశ్రామిక కారిడార్లలో భాగంగా అభివృద్ధి చేస్తున్న వివిధ నోడ్‌ల వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.