అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. హుకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ పరిధిలోని పెదగరువుకు చెందిన కె.విజయకుమారి నిండు గర్భిణి. ఆమెకు సోమవారం అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇవ్వగా.. జి మాడుగుల నుంచి108 సిబ్బంది వాహనంతో అక్కడికి చేరుకున్నారు. వెంటనే గర్భిణిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గ మధ్యలోనే హుకుంపేట సమీపంలోకి రాగానే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే 108 సిబ్బంది వాహనంలోనే పురుడుపోశారు. ఆమె ముగ్గురు ఆడ పిల్లలు జన్మించారు.. వెంటనే తల్లీబిడ్డలను అక్కడి నుంచి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. వాహనంలో ప్రసవం చేసి, తల్లీబిడ్డలను కాపాడిన 108 సిబ్బందిని స్థానికులు, ఆస్పత్రి సిబ్బంది, మహిళ కుటుంబ సభ్యులు అభినందించారు. ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనివ్వడం చర్చనీయాంశమైంది.
- Read Latest Andhra Pradesh News and Telugu News