యాప్నగరం

అనకాపల్లి: మొబైల్ విషయంలో చిన్న పొరపాటు.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు

Narsipatnam Mobile Short Circuit Death మొబైల్ విషయంలో నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. ఛార్జింగ్ పెట్టి ఫోన్ కాల్ మాట్లాడుతుండగా షార్ట్ సర్క్క్యూట్ అయ్యింది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాల్ వచ్చిందన్న హడావిడిలో పవర్ స్విచ్ ఆపేయడం మర్చిపోయాడు. ఇంతలోనే ఘోరం జరిగింది. తీవ్రంగా గాయపడిన యువకుడ్ని ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. మొబైల్స్ వినియోగించే విషయంలో జాగ్రత్తలు అవసరం అంటున్నారు.. అయినా కొందరు మాత్రం మారడం లేదు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 13 May 2023, 2:04 pm

ప్రధానాంశాలు:

  • నర్సీపట్నంలో దారుణం జరిగింది
  • మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ కాల్ మాట్లాడాడు
  • షార్ట్ సర్క్యూట్‌తో ప్రాణాలు కోల్పోయాడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Narsipatnam Mobile Short Circuit Incident
మొబైల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చిన్న పొరపాటు జరిగినా మొబైల్ పేలి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఛార్జింగ్ పెట్టి మొబైల్ ఉపయోగించొద్దని ఎన్నోసార్లు చెప్పినా కొందరు మారడం లేదు. గతంలో ఎన్నో ఘటనలు జరిగినా.. అజాగ్రత్తతో ఉంటున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కూడా అదే జరిగింది. ఓ యువకుడు ఛార్జింగ్ పెట్టి మొబైల్ మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు.
నర్సీపట్నం కోమటి వీధికి చెందిన లక్ష్మణ్ క్యాటరింగ్ బాయ్. శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో తన మొబైల్‌కు చార్జింగ్‌ పెట్టాడు. అదే సమయంలో కాల్ వచ్చింది.. కానీ పవర్ ఆపకుండా చార్జింగ్‌లో ఉన్న మొబైల్ లిఫ్ట్ చేశాడు. అతడు కాల్ మాట్లాడుతుండగా.. ఛార్జర్‌ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఈ ఘటనలో లక్ష్మణ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.

లక్ష్మణ్‌ ఆస్పత్రికి వెళ్లే మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టి కాల్స్ మాట్లాడొద్దని.. గేమ్స్ ఆడొద్దని నిపుణులు హెచ్చరించారు. ఒక్కో సందర్భంలో జేబులో ఉన్న మొబైల్ పేలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మొబైల్ బాగా హీట్‌గా ఉన్న సమయంలో కూడా ఉపయోగించకూడదు. ఛార్జింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం అంటున్నారు. కానీ కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

మరో రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయారు. దేముడు అనకాపల్లి గొలుగొండ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కోర్టు పని నిమిత్తం అదే గ్రామానికి చెందిన సింగంపల్లి అప్పలనాయుడుతో కలిసి కారులో శుక్రవారం విశాఖ బయలు దేరారు. ఈక్రమంలో పెందుర్తి- ఆనందపురం హైవే దుక్కవానిపాలెం టోల్‌గేట్‌ సమీపంలో మంచినీటి కోసం కానిస్టేబుల్‌ కారు దిగారు. ఇంతలో వెనుక నుంచి వస్తున్న ఓ వ్యాన్‌ ఆగి ఉన్న కారును, దేముడును ఢీకొట్టింది.
ఈ ఘటనలో దేముడు తీవ్రంగా గాయపడగా.. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న మిగిలినవారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. దేముడిది అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చంద్రయ్యపేట సొంత ఊరు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దేముడు మరణంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.