యాప్నగరం

భర్త చేసిన పనికి.. దిక్కుతోచని స్థితిలో భార్య.. విజయనగరంలో ఘోరం!

విజయనగరం జిల్లా గుర్లలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు వాహనం కొనివ్వలేదనే మనస్తాపంతో..!

Samayam Telugu 16 Jun 2021, 5:31 pm
ఏడాది క్రితమే పెళ్లయింది.. భార్య ప్రస్తుతం నిండు గర్భిణి.. త్వరలోనే తండ్రి కావాల్సిన యువకుడు క్షణికావేశంలో ఘోరానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులు వాహనం కొనివ్వలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న ఆ భార్య దిక్కుతోచని స్థితిలో మిగిలింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండలంలో చోటుచేసుకుంది.
Samayam Telugu గుర్లలో యువకుడి ఆత్మహత్య


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గరివిడి మండలం అర్తమూరుకు చెందిన దబ్బాడ అప్పలరాజు (29) మైలన్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఏడాది క్రితం గుర్ల మండలం జమ్ముపేటకి చెందిన కె.రేణుకతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. కరోనా కారణంగా గత రెండు నెలలుగా అప్పలరాజు సెలవు పెట్టి వచ్చేశాడు.

తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, ట్రాక్టర్ లేదా ఆటో కొనివ్వాలని తల్లిదండ్రులను అప్పలరాజు కోరాడు. ప్రస్తుతం డబ్బులు లేవని, కరోనా తగ్గిన తర్వాత చూద్దామని వారు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన అప్పలరాజు.. జమ్ముపేట వద్దనున్న మామిడితోటలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నిండింది. అప్పలరాజు క్షణికావేశంలో చేసిన పనికి.. మధ్యలో అతడి భార్య బలైపోయింది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ఆసుపత్రికి తరలించారు. గుర్ల ఎస్‌ఐ లీలావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.