యాప్నగరం

Andhra: ఫోన్ మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్ వేస్తూ.. నర్సుకు షాకిచ్చిన అధికారులు!

విజయనగరం జిల్లాలో ఓ నర్సు ఫోన్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ వేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Samayam Telugu 10 Apr 2021, 11:06 pm
Samayam Telugu ఫోన్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ వేస్తున్న నర్సు
కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి రోజూ 6 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఓ నర్స్ ఫోన్‌లో మాట్లాడుతూ.. మహిళకు వ్యాక్సిన్ ఇవ్వడం కలకలం రేపింది.

ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. సదరు నర్సును జగన్నాథపురం అర్బన్ పీహెచ్‌సీకి చెందిన హేమలతగా గుర్తించారు. ఫోన్‌లో మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా వైద్యశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా వైద్యశాఖాధికారి రమణకుమారి.. హేమలతకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు.

కాగా, పలుచోట్ల వైద్యులు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు వృద్ధ మహిళలకు కరోనా వ్యాక్సిన్‌కు బదులుగా రేబిస్ వ్యాక్సిన్ వేశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రేబిస్ వ్యాక్సిన్ కారణంగా టీకా తీసుకున్న ముగ్గురు మహిళల్లో కొన్ని దుష్ప్రభావాలు కనిపించాయి. దీంతో ఆందోళన చెందిన మహిళలు అధికారులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం తెలుసుకున్న అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించి రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ అత్యంత సెన్సిటివ్ ఇష్యూ కావడంతో విజయనగరం జిల్లా నర్సు తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.