యాప్నగరం

చీపురుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.. కాన్వాయ్ ఆపి బాధితులకు చంద్రబాబు సాయం

శుక్రవారం రాత్రి చీపురపల్లిలో సభను ముగించుకుని మాజీ సీఎం చంద్రబాబు విశాఖకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ అదుపుతప్పి కింద పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గమనించి బాబు.. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించారు. కిందకు దిగి క్షతగాత్రుల పరిస్థితి చూసి చలించిపోయారు. వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. 108 కోసం ఎదురుచూడకుండా తన కాన్వాయ్‌లోని అంబులెన్స్ సాయంతో వారిని పంపారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 18 Jun 2022, 8:11 am

ప్రధానాంశాలు:

  • ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు నాయుడు.
  • చీపురపల్లిలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం.
  • బాధితులను ఆస్పత్రికి తరలించిన మాజీ సీఎం.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చంద్రబాబు నాయుడు
రోడ్డు ప్రమాద బాధితుల పట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదారతను చాటుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా చీపురపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు.. చీపురుపల్లిలో రోడ్ షో ముగించుకుని విశాఖకు వెళ్తున్నారు. ఈ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించి మాజీ ముఖ్యమంత్రి తన కాన్వాయ్‌ను ఆపించి కిందకు దిగారు.
బాధితుల పరిస్థితిని గమనించిన చంద్రబాబు వారిని అంబులెన్స్‌లో తరలించే ఏర్పాటు చేశారు. తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లోనే వారిని ఆసుపత్రికి పంపించారు. స్థానిక నేతలతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని చంద్రబాబు సూచించారు.

కాగా, అంతకు ముందు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురపల్లిలో జరిగిన రోడ్ షోలో మంత్రిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా పదో తరగతి పరీక్షల ఫలితాలు తగ్గాయని, దీనికి ఆంగ్ల మాధ్యమమే కారణమని ధ్వజమెత్తారు. ఇంగ్లిష్‌ పేరుతో విద్యా రంగాన్ని నాశనం చేస్తున్నారని, నాడు-నేడు పేరుతో పాఠశాలలకు రంగులు వేశారు ఆరోపించారు. పరిపాలన ఎటు వెళ్తోంది? లిక్కర్‌ డాన్‌గా పేరొందిన బొత్స సత్యనారాయణను విద్యా మంత్రిని చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తిరోగమన విధానాలతో విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, పదో తరగతి ఫలితాలు తగ్గేందుకు విద్యార్థుల తల్లిదండ్రులదే బాధ్యతని బొత్స మాట్లాడడం ఎంతవరకు సబబు? అని.. తల్లిదండ్రులుగా మీరే చెప్పండని బాబు ప్రశ్నించారు. బొత్స అవినీతి అడ్డా ఇదని, ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఆయనపై ఉన్న వ్యతిరేకత అర్థమవుతోందన్నారు. బొత్సా.. ఇక్కడకు వచ్చిన జనాన్ని చూడు.. ఈ జనాన్ని చూసి జగన్‌రెడ్డికి, బొత్సకు నిద్రపట్టదు. ఆయనకు జిల్లాను జాగీరుగా రాసిచ్చారా? జనాల్లో మార్పు మొదలైంది. రాజకీయంగా బొత్స కుటుంబ పాలనను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.