యాప్నగరం

మంత్రి పదవిపై ఈ ఎమ్మెల్యేల కన్ను.. అవకాశం దక్కేదెవరికి..?

ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని సంకేతాలు వస్తున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా నుంచి ఆశావహులు కేబినెట్‌లో బెర్త్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణకు మరోసారి కేబినెట్‌లో..

Samayam Telugu 20 Mar 2022, 4:32 pm
ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం దగ్గర పడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్తగా ఎవరికీ కేబినెట్‌లో చోటు దక్కుతుందో.. ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి పార్టీ బాధ్యతలకు అప్పగిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త జిల్లాలతో పాటు కొత్త మంత్రివర్గం కొలువు దీరుతుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ముహూర్తం ఉంటుందని సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో.. విజయనగరం జిల్లాలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Samayam Telugu ఏపీ మంత్రివర్గ విస్తరణ


ప్రస్తుతం జిల్లా నుంచి మంత్రులుగా బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో కేబినెట్ విస్తరణ జరిగితే.. ఈ ఇద్దరిలో పుష్ప శ్రీవాణికి మరోసారి మంత్రి పదవి దక్కడం కష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కురుపాం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పుష్ఫ శ్రీవాణికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మంచి ప్రాధాన్యమే కల్పించారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు. మూడేళ్లపాటు తనకు అప్పగించిన బాధ్యతలను ఆమె సమర్థవంతంగా నిర్వహించారు.

మరో మంత్రి బొత్స సత్యనారాయణ.. కేబినెట్‌లో కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స.. అటు ప్రభుత్వంలో.. ఇటు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019లో పార్టీ అధికారంలోకి రావడంతో బొత్స సత్యనారాయణకు కేబినెట్‌లో మున్సిపల్ శాఖతోపాటు పట్టణ అభివృద్ధి శాఖలను సీఎం జగన్ అప్పగించారు. సీనియర్ నాయకుడిగా బొత్సకు మరోసారి కేబినెట్‌లో బెర్త్ దక్కే అవకాశం కనిపిస్తోంది.

విజయనగరం జిల్లా నుంచి కొత్తగా పోటీలో ఉన్నట్లు ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తాము మంత్రి పదవుల రేసులో ఉన్నట్లు కిందిస్థాయి క్యాడర్ ప్రచారం చేస్తోంది. అయితే సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు గత మంత్రివర్గంలో చోటు గ్యారంటీ అయినా.. చివరి నిమిషంలో నిరాశ ఎదురైంది.

సీనియర్ ఎమ్మెల్యే అయినా.. ఆయన ఏనాడు పార్టీ లైన్ దాటి మాట్లాడలేదు. స్థానికంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని రాజన్న దొరకు పేరుంది. ఈసారి జరగబోయే కేబినెట్ విస్తరణలో పుష్ప శ్రీవాణి స్థానంలో రాజన్నదొరకు జగన్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ శాసనసభ స్పీకర్‌ను కూడా మారిస్తే.. ఆ పదవి శంబంగి వెంకట చిన్ని అప్పలనాయుడుకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి.. సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పిస్తారో..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.