యాప్నగరం

Mahila Savings: మహిళలకు గుడ్‌న్యూస్.. పోస్టాఫీసుల్లో కొత్త స్కీమ్ షురూ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Mahila Savings: మహిళలు, బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన సేవింగ్స్ స్కీమ్ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పొదుపు పథకాన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఇతర పొదుపు పథకాల్లోనూ అనే మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌లో పొదుపు చేసేందుకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 2 Apr 2023, 10:54 am
Mahila Savings: కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ పథకాన్ని వార్షిక బడ్జెట్ 2023-24 బడ్జెట్‌లో భాగంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పొదుపు పథకాన్ని (Mahila Samman Savings Certificates) ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ కొత్త పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం అర్ధరాత్రి తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 1.59 లక్షల పోస్టాఫీసుల్లో ఈ పథకాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది.
Samayam Telugu MSSC
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్


మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పొదుపు పథకాన్ని మహిళలు లేదా బాలికల పేరుపై మాత్రమే తెరిచేందుకు వీలుంటుంది. ఈ పథకం ఏప్రిల్, 2023 నుంచి మార్చి, 2025 వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. ఈ పథకాన్ని 7.50 శాతం మేర స్థిరమైన వడ్డీ లభిస్తుంది. ఇందులో గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకం కేవలం పోస్టాఫీసుల్లోనే అందుబాటులోకి వచ్చింది. అయితే, బ్యాంకుల్లోకి ఎప్పుడు తీసుకొస్తారనే విషయంపై స్పష్టత లేదు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
  • సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన దరఖాస్తు ఫారాన్ని తీసుకోవాలి.
  • మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలతో పాటు నామినీ వివరాలను అందులో పొందు పరచాలి.
  • మీ గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్ కోసం అవసరమైన ఆధార్, పాన్ కార్డు వంటి డాక్యుమెంట్లను జత చేయాలి.
  • డిపాజిట్ ఎంత చేస్తున్నారనేది తెలియజేయాలి.
  • నగదు లేదా చెక్కు రూపంలో డిపాజిట్ చేయవచ్చు.
  • ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ పెట్టుబడికి రుజువుగా సర్టిఫికెట్ ఇస్తారు.
  • ఈ పథకం ట్రాన్సాక్షన్ రసీదు కాగితం రూపంలో కావాలంటే రూ.40, ఎలక్ట్రానిక్ రూపంలో కావాలంటే రూ.9 ఛార్జీలు వసూలు చేస్తారు.
  • ఇందులో ఏడాది తర్వాత కొంత మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉంది. డిపాజిట్ మొత్తంలో 40 శాతం వరకు వెనక్కి ఇస్తారు.
  • గడువు పూర్తయ్యే వరకు ఖాతాను మూసివేసేందుకు కుదరదు. అయితే, అకౌంట్ హోల్డర్ చనిపోయినా, తీవ్ర అనారోగ్యానికి గురైనా ముందస్తుగా ఖాతాను రద్దు చేసుకోవచ్చు. కానీ, అప్పటికీ ఖాతా తెరిచి కనీసం ఆరు నెలలు గడిచి ఉండాలి.
  • మహిళా సేవింగ్స్ సమ్మాన్ స్కీమ్‌తో పాటు ఇతర పొదుపు పథకాలపైన పీపీఎఫ్, సుకన్య సమృద్ది యోజన వంటి వాటిల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.