యాప్నగరం

Arun Jaitley: విలీన బ్యాంకుల ఉద్యోగులకు శుభవార్త

మూడు బ్యాంకుల విలీనం వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మాదిరిగా మరో మెగా బ్యాంక్ ఆవిర్భవిస్తుందని జైట్లీ పేర్కొన్నారు.

Samayam Telugu 4 Jan 2019, 5:54 pm
విలీనం కాబోతోన్న బ్యాంకుల ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీపి కబురు అందించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల తొలగింపు ఉండదని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర క్యాబినెట్ ఇటీవలే బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయా బ్యాంకుల విలీనానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మూడు బ్యాంకుల విలీనం వల్ల ఎవరి ఉద్యోగం పోదని శుక్రవారం లోక్ సభలో జైట్లీ తెలిపారు. అదే సమయంలో విలీనం వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మాదిరిగా మరో మెగా బ్యాంక్ ఆవిర్భవిస్తుందని పేర్కొన్నారు. అలాగే రుణ మంజూరు వ్యయాలు తగ్గుతాయని తెలిపారు.
Samayam Telugu jaitley


21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో.. 11 బ్యాంకులు ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు చర్యల (పీఏసీ) నిబంధనలను ఎదుర్కొంటున్నాయని జైట్లీ పేర్కొన్నారు. అధిక మొండి బకాయిల సమస్యతో సతమతమౌతోన్న బ్యాంకులపై ఆర్‌బీఐ ఈ పీఏసీ నిబంధనలను విధిస్తుంది.

బ్యాంకుల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) తగ్గుతాయని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. దివాలా చట్టం వల్ల దాదాపు రూ.3 లక్షల కోట్లు వ్యవస్థలోకి వచ్చాయని పేర్కొన్నారు. ఎస్‌బీఐ సహా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా నిర్వహణ లాభాలను అర్జిస్తున్నాయని తెలిపారు. అయితే మొండి బకాయిల కేటాయింపుల వల్ల బ్యాంకులు నష్టాలను ప్రకటిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.51,533 కోట్లు అందించామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.