యాప్నగరం

మొబైల్ వాలెట్లకు కేవైసీ నిబంధనల బెంగ

ప్రైవేట్‌ కంపెనీలు తమ కస్టమర్ల ధ్రువీకరణ కోసం ఆధార్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ కేవైసీ వెరిఫికేషన్‌ (ఈకేవైసీ) ప్రక్రియను అమలు చేయడానికి వీలులేదంటూ సుప్రీం కోర్టు గతంలో తీర్పునివ్వడంతో మొబైల్‌ వాలెట్‌ సంస్థలకు సమస్యలు వచ్చి పడ్డాయి.

Samayam Telugu 10 Jan 2019, 8:52 am

ప్రధానాంశాలు:

  • వీటి వెరిఫికేషన్‌కు ఫిబ్రవరి చివరి వరకు గడువు
  • ఈలోగా ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువ
  • 95 శాతం వరకు వాలెట్లు మూతపడే అవకాశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu mobil
మొబైల్‌ వాలెట్‌ సంస్థలకు కేవైసీ నిబంధనలు కొత్త సమస్యగా మారాయి. కస్టమర్ల వివరాల (కేవైసీ) ధ్రువీకరణ ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్‌బీఐ గతంలోనే ఆదేశాలు జారీచేసింది. వీటిని అమలు చేయడానికి వాలెట్‌ సంస్థలు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. అయితే నిర్దేశిత గడువులోగా ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ప్రైవేటు సంస్థలు కస్టమర్ల నుంచి ఈ–కేవైసీ కోసం ఆధార్‌ను తీసుకోవడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వాలెట్‌ సంస్థలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. గడువు ముగియడానికి ఇంకా కొన్ని వారాల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా.. ఇప్పటిదాకా చాలా వరకు సంస్థలు కేవలం కొద్ది మంది కస్టమర్ల కేవైసీ మాత్రమే పూర్తి చేయగలిగాయి. దీంతో దాదాపు 95 శాతం మొబైల్‌ వాలెట్లు మార్చి తర్వాత కార్యకలాపాలు నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రైవేట్‌ కంపెనీలకు ఈ–కేవైసీ అందుబాటులో లేకపోవడంతో.. వీడియో ఆధారిత వెరిఫికేషన్, ఎక్స్‌ఎంఎల్‌ ఆధారిత కేవైసీ వంటి ప్రత్యామ్నాయ విధానాలనైనా అనుమతించాలన్న డిమాండ్లు ఉన్నాయి. అయితే, వీటికి రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి అధికారికంగా ఆమోదముద్ర లేదు.

కాగా మొబైల్‌ వాలెట్‌ సంస్థలన్నీ కూడా కచ్చితంగా కేవైసీ ధ్రువీకరణ జరపాల్సిందేనంటూ 2017లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది. దీంతో పలు సంస్థలు ఆధార్‌ ఆధారంగా ఎలక్ట్రానిక్‌ రూపంలో కేవైసీ వెరిఫికేషన్‌ జరిపాయి. పేమెంట్స్‌ బ్యాంకింగ్‌ లైసెన్స్‌ కూడా పొందిన పేటీఎం.. బయోమెట్రిక్‌ డాంగిల్స్, ఫీల్డ్‌ ఏజెంట్లను ఉపయోగించి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు కొత్త బ్యాంకు ఖాతాలు కూడా తెరిచింది. ఈ విధంగా పేటీఎం తమ యూజర్లలో దాదాపు 70 శాతం మందికి పూర్తి స్థాయిలో కేవైసీ నిబంధనలు అమలు చేయగలిగింది. కానీ మిగతా కంపెనీలు మాత్రం సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

భారత్‌లో నాలుగేళ్ల క్రితం వాలెట్‌ కంపెనీలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి. అయితే ప్రస్తుతం కొన్ని మాత్రమే మిగిలాయి. మొబిక్విక్, ఫోన్‌పే, అమెజాన్‌పే వంటి సంస్థలు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)తోపాటు ఇతర డిజిటల్ కార్యకలాపాల్లోకి మళ్లాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి సంస్థలకు మాత్రమే మనుగడ ఉండవచ్చని, స్టాండెలోన్‌ వాలెట్లపై మాత్రం ప్రతికూల ప్రభావం పడొచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.