యాప్నగరం

ఏపీలో రూ.80కి చేరిన పెట్రోల్ ధర, డీజిల్ రూ.70 పైనే

పెట్రోల్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరాయి, డీజిల్ అయితే ఆల్ టైం హై స్థాయికి చేరుకుంది.

Samayam Telugu 1 Apr 2018, 2:04 pm
పెట్రోల్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరాయి. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.73 పైసలకి చేరగా.. డీజిల్ ధరలు రూ. 64.58 పైసలకు చేరింది. ఇంతకు మునుపెన్నడూ డిజీల్ ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. 2014 సెప్టెంబర్ తర్వాత పెట్రోల్ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 78 పలకగా.. విశాఖలో రూ. 79 దాటింది. చిత్తూరు, నెల్లూరులో రూ.80 మార్క్‌ను చేరుకుంది. డిజిల్ ధరలు హైదరాబాద్‌లో రూ.69.74 పైసలు, వైజాగ్‌లో రూ.70.66 పైసలకు చేరడం గమనార్హం.
Samayam Telugu పెట్రోల్ ధరలు


అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో.. పెట్రోల్, డీజిల్‌‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖ గతంలో సూచించింది. కానీ ఆర్థిక మంత్రి ఆ సూచనల్ని పట్టించుకోకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టారు.

దక్షిణాసియాలో పెట్రోల్, డీజిల్‌పై అత్యధిక మొత్తంలో పన్నులు వేస్తున్న దేశం భారతే కావడం గమనార్హం. చమురు ధరలు తగ్గినప్పుడల్లా.. 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య జైట్లీ 9 సార్లు ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. కానీ ఒక్కసారి మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. గత ఏడాది అక్టోబర్లో లీటర్‌కు రూ.2 చొప్పున తగ్గించారు.

అనంతరం పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కానీ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మాత్రం వ్యాట్ తగ్గించాయి. మిగతా రాష్ట్రాలు కేంద్ర మాటను లక్ష్యపెట్టలేదు.

గతంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నెలకు రెండుసార్ల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించేవి. కానీ గత ఏడాది జూన్ నుంచి రోజువారీ ధరలను సమీక్షించడం ప్రారంభించాయి. అప్పటి నుంచి చమురు ధరలు రోజుకు కొద్ది పైసల చొప్పున పెరుగుతూ.. తెలియకుండానే వాహనదారులకు భారంగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.