యాప్నగరం

RBI: బయటపడుతున్న బ్యాంకుల డొల్లతనం.. మరో 2 బ్యాంకులపై ఆర్‌బీఐ చర్యలు..!

RBI: దేశంలోని బ్యాంకుల తీరు ఆందోళన కలిగిస్తోంది. వరుస పెట్టి బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటున్న తీరు చూస్తే వాటి డొల్లతనం బయటపడుతోంది. ఇటీవలి కాలంలో దాదాపు 20కిపైగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలపై చర్యలు తీసుకుంది ఆర్‌బీఐ. తాజాగా మరో రెండు బ్యాంకులు రూల్స్ పాటించలేదని భారీగా పెనాల్టీ విధించింది. ఈ క్రమంలో ఆ బ్యాంకులు ఏమిటి, ఎంత పెనాల్టీ పడింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చెద్దాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 27 Mar 2023, 5:06 pm
RBI: బ్యాంకులే నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాయి. తాజాగా మరో రెండు బ్యాంకులు ఆ జాబితాలో చేరిపోయాయి. నిబంధనలు ఉల్లంఘించడం, బ్యాంకు నియమాలకు కట్టుబడి ఉండకపోవడంపై రెండు బ్యాంకులపై మానిటరీ పెనాల్టీ విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) ఆర్‌బీఐ సోమవారం మార్చి 27న ప్రకటించింది. ఆ జాబితాలో అలిఘఢ్ జిల్లా సహకార బ్యాంక్, దిల్లీ నాగరిక్ సహకార బ్యాంక్ ఉన్నాయి. ఈ మేరకు వేరు వేరుగా రెండు ప్రకటనలు జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
Samayam Telugu RBI.
ఆర్‌బీఐ


అలిఘఢ్ జిల్లా సహకార బ్యాంక్‌పై (Aligarh Zila Sahkari Bank) నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో రూ.2 లక్షల మానిటరీ పెనాల్టీ (RBI Imposes Monetary Penalty) విధించింది రిజర్వ్ బ్యాంక్. అలాగే దిల్లీ నాగరిక్ సహకార బ్యాంక్‌పై (Delhi Nagrik Sehkari Bank) రూ.3 లక్షల పెనాల్టీ వేసినట్లు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1950, డిపాజిట్లపై వడ్డీ రేట్లకు సంబంధించిన నిబంధనలకు కట్టుబడి ఉండకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించిన క్రమంలో ఈ జరిమానా వేసినట్లు తెలిపింది. రెగ్యులేటరీ కాంప్లియన్స్‌ను పాటించకపోవడం, కస్టమర్లకు సంబంధించిన ట్సాన్సాక్షన్లు, అగ్రిమెంట్లను వెల్లడించకపోవడం నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది రిజర్వ్ బ్యాంక్.

మూడు రోజుల క్రితమే ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ కరూర్ వైశ్యా బ్యాంక్‌పై రూ.30 లక్షల పెనాల్టీ విధిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గత శుక్రవారం మార్చి 24న వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. సెలెక్ట్ స్కోప్ ఇన్స్‌పెక్షన్ నిర్వహించిన తనిఖీల్లో లోపాలు బయటపడినట్లు తెలిపింది. మరోవైపు.. మార్చి 10న దేశంలోని 17 నాన్ బ్యాంకింగ్ సంస్థలో సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు ఆయా ఎన్‌బీఎఫ్‌సీలు వాటి సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌ను తిరిగి సరెండర్ చేసినట్లు పేర్కొంది. అంతకు ముందు మధ్య ప్రదేశ్‌కు చెందన ఓ కోఆపరేటివ్ బ్యాంక్ దివాలా తీసిన క్రమంలో దాని లైసెన్స్ రద్దు చేసింది. మళ్లీ కొద్దు రోజులకే మరో 7 కోఆపరేటివ్ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దిగజారడంతో వాటి లావాదేవీలపై ఆంక్షలు విధించింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ఇలా వరుస పెట్ట బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించడం ఆందోళన కలిగిస్తోంది. కస్టమర్ల సొమ్ముకు భద్రత లేకుండా పోతోందనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనిఖీలు చేస్తూ కఠిన ఆంక్షలు, పెనాల్టీలు విధిస్తూ వస్తోంది. బ్యాంకింగ్ రంగాన్ని గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.
రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.