యాప్నగరం

Rs 2000 Notes Withdrawal: రూ. 2 వేల నోట్ల ఉపసంహరణతో లాభాలివే.. మోదీ సర్కార్ బిగ్ స్కెచ్!

Rs 2000 Notes: రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమేనని తెలుస్తోంది. దీని గురించి ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే.. నోట్ల ఉపసంహరణ వల్ల కలిగే లాభాలేంటో.. పలు కారణాలను స్పష్టంగా వివరించి చెప్పారు ఆర్థిక శాఖ మాజీ సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 6 Jun 2023, 10:15 am
Rs 2000 Notes Withdrawal: రిజర్వ్ బ్యాంక్ మే 19న రూ. 2 వేల నోటు గురించి కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లను చలామణీ (Currency Circulation) నుంచి మెల్లగా ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ ఆకస్మిక ప్రకటన విపక్షాల నుంచి విమర్శలకు దారి తీసింది. అయితే.. ఈ నోట్ల ఉపసంహరణ వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నప్పటికీ.. మరోవైపు విపక్షాలు మాత్రం కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. ఈ తరుణంలో దీనిపై స్పందించారు ఆర్థిక శాఖ మాజీ ప్రధాన సలహాదారు (EX CEA) కృష్ణమూర్తి సుబ్రమణియన్. ఈ నోట్ల ఉపసంహరణ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమేనని అన్నారు. దీనిని కొన్ని అంశాలతో ఆయన వివరణ కూడా ఇచ్చారు. మరి ఇంతకీ సుబ్రమణియన్ ఏం చెప్పారో చూద్దాం. ఆయన మాటల్లోనే..
Samayam Telugu NOTES BAN


'రూ. 2 వేల నోట్లు వెనక్కి తీసుకోవడంతో నగదు నిల్వ తగ్గుతుంది. సుమారు రూ.3.6 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇందులో కొంతభాగం ఎక్కడుందో కూడా తెలియదు. అవన్నీ కూడా ఇప్పుడు బయటికి వస్తాయి. ఈ మధ్య తరచూ దర్యాప్తు సంస్థల దాడుల్లో నోట్ల కట్టలు బయటపడుతుండగా.. వాటిల్లో రూ. 2 వేల నోట్లే ఎక్కువ. దేశంలో 80 శాతం మంది ప్రజలు.. తమ దగ్గర ఉన్న రూ. 2 వేల నోట్లను చట్టబద్ధంగా భద్రపరుచుకున్నారు. అయితే ఆ నోట్ల విలువ మొత్తం చలామణీలో ఉన్న రూ. 2 వేల నోట్ల విలువలో 20 శాతం మాత్రమే. మిగతా 20 శాతం మంది వద్ద ఉన్న రూ. 2 వేల నోట్ల కట్టల విలువే 80 శాతం. అప్పుడు అదంతా వెలికితీసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది.' అని అన్నారు సుబ్రమణియన్.


అదే విధంగా 2000 రూపాయల నోటు ఉపసంహరణ వల్ల సామాన్యులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగదని చెప్పారు సుబ్రమణియన్. అందుకు ఐదు కారణాలను కూడా వివరించారు.

1. ప్రస్తుతం రూ. 2 వేల నోటును ఎక్కడైనా చెల్లింపుల కోసం ఎక్కువగా వినియోగించట్లేదు. ప్రస్తుతం చలామణీలో ఉన్న కరెన్సీ నోట్లలో ఈ నోట్ల విలువ మొత్తం 10.8 శాతమే.
2. ఇంకా ప్రస్తుతం ఎక్కువ లావాదేవీలు డిజిటల్ పేమెంట్స్ రూపంలోనే జరుగుతున్నాయి. అందుకే.. కరెన్సీ నోట్లు ముఖ్యంగా రూ. 2 వేల నోట్ల వినియోగం తగ్గిపోతోంది.
3. 2 వేల నోటుకు ప్రత్యామ్నాయంగా వినియోగించుకునేందుకు ఇంకో పెద్ద నోటు రూ. 500 ఉండనే ఉంది. నగదు మార్పిడి కోసం ఈ నోటు వాడుకోవచ్చు.
4. 2026 నాటికి డిజిటల్ పేమెంట్స్ 3 రెట్లు పెరుగుతాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అందువల్ల రానున్న కాలంలో రూ. 2 వేల నోటు వినియోగం అవసరం ఉండకపోవచ్చు.
5. చివరగా అత్యంత ముఖ్యమైన విషయం.. రూ. 2 వేల నోటు చెల్లుబాటు (లీగల్ టెండర్) ప్రస్తుతం కొనసాగుతుందని ఆర్‌బీఐ చెప్పింది. సెప్టెంబర్ 30 తర్వాత కూడా ఇది చెల్లుబాటులో ఉంటుందా లేదా అనేది ఆర్‌బీఐ మళ్లీ స్పష్టత ఇస్తుంది. ఈ గడువులోగా.. చట్టబద్ధంగా భద్రపరుచుకున్న వారు నగదు మార్చుకునేందుకు పెద్ద సమస్య ఉండదు. ఎటు చూసినా కూడా ఇది సరైన నిర్ణయమే..

అని మాజీ సీఈఓ కృష్ణమూర్తి సుబ్రమణియన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో వివరించారు.





ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం.. బాధలో ఐటీ ఉద్యోగులు.. మరీ ఇలా చేస్తుందని అనుకుంటారా?

అసలు రూ. 2 వేల నోట్లను రద్దు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ చెప్పిందా? ప్రెస్‌మీట్‌లో చెప్పిన విషయం తెలిస్తే..!
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.