యాప్నగరం

55 శాతం పెరిగిన స్టీల్ ధర.. ప్రధాని మోదీకి గడ్కరీ లేఖ

కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా దేశంలో నిర్మాణ రంగం కుదేలైంది. కానీ స్టీల్, సిమెంట్ సంస్థలు మాత్రం ధరలను భారీగా పెంచుతున్నాయి. ఈ విషయమై ప్రధాని మోదీకి గడ్కరీ లేఖ రాశారు.

Samayam Telugu 18 Dec 2020, 12:03 pm
దేశంలో మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం దృష్టి సారిస్తోన్న వేళ స్టీల్, సిమెంట్ ధరలు పెరగడం పట్ల మంత్రి నితిన్ గడ్కరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ రంగానికి కీలకమయ్యే స్టీల్, సిమెంట్ విషయంలో దీర్ఘకాలిక పాలసీలను రూపొందించాలన్నారు. గత ఆరు నెలల్లో స్టీల్ కంపెనీలు ధరలను 55 శాతం పెంచాయన్నారు. అత్యున్నత స్థాయిలో ఈ విషయమై చర్చించడానికి ప్రధాని మోదీకి లేఖ రాశానని గడ్కరీ తెలిపారు. ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
Samayam Telugu nitin-gadkari-bccl
Nitin Gadkari


స్టీల్, సిమెంట్ ధరల పెరుగుదల మంచిది కాదన్న గడ్కరీ.. ఉత్పాదకత తగ్గడం, ధరలు పెరగడం మంచి స్ట్రాటజీ కాదన్నారు. పదే పదే ధరలు పెంచుతున్న సిమెంట్ కంపెనీల తీరును ఆయన విమర్శించారు. స్టీల్, సిమెంట్ కంపెనీల తీరు దేశానికి మంచిది కాదన్నారు.

సిమెంట్, స్టీల్ కంపెనీలు ఇప్పటిలాగే ధరలు పెంచే విధానానికి కట్టుబడి ఉంటే మౌలిక వసతుల ప్రాజెక్టులు ఆర్థికంగా భారం అవుతాయని.. దీంతో ప్రభుత్వం పాలసీ మార్చే అవసరం తలెత్తొచ్చన్నారు. సిమెంట్ కంపెనీలు ఓ బృందంగా ఏర్పడి ధరలను పెంచుతున్నాయని గడ్కరీ కొద్ది రోజుల క్రితం విమర్శించారు. నిర్మాణ రంగం కోలుకోవడానికి ఇబ్బందులు పడుతున్నా.. వాటికి పట్టడం లేదన్నారు.

‘రోడ్లన్నింటినీ కాంక్రీట్ రోడ్లుగా మార్చాలని నిర్ణయించాను. సిమెంట్ ఇండస్ట్రీని ప్రోత్సాహించాలని భావించాను. కానీ సిమెంట్ సంస్థలు దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నాయి’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.