భారత్లోకి ‘బికినీ’ ఎయిర్లైన్స్.. రూ.9కే విమాన టికెట్!
బికినీ ఎయిర్లైన్స్ ఎంట్రీ ఇస్తోంది. భారత్ కార్యకలాపాలకు సర్వం సిద్ధం చేసుకుంది. ఎప్పటి నుంచి సేవలు ప్రారంభిస్తున్నది ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి ఈ కంపెనీ భారత్ నుంచి విదేశాలకు విమానాలు నడుపనుంది.
Samayam Telugu 21 Aug 2019, 2:49 pm
ప్రధానాంశాలు:
- భారత్లో కార్యకలాపాల ప్రారంభానికి వియత్ ఎయిర్లైన్స్ రెడీ
- డిసెంబర్ 6 నుంచి సేవలు ప్రారంభం
- తొలి ఫ్లైట్ ఢిల్లీ నుంచి వియత్నాంకు ఎగురుతుంది
- మూడు రోజుల డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ
బికినీ ఎయిర్లైన్స్.. పేరే కొత్తగా ఉంది కదూ. అవునండి మీరు చదివింది నిజమే. వియత్ జెట్ అనే విమానయాన కంపెనీ ఒకటుంది. ఇది వియత్నాం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రయాణికులు ఈ కంపెనీని బికినీ ఎయిర్లైన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి కారణం కంపెనీ అనుసరించే వినూత్నమైన ప్రమోషనల్ యాక్టివిటీస్. వియత్ జెట్ కంపెనీ భారత్లో కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తోంది. ఈ ఎయిర్లైన్స్ ఈ ఏడాది డిసెంబర్ 6 నుంచి సేవలు ప్రారంభిస్తామని తాజాగా ప్రకటించింది. తొలి ఫ్లైట్ ఢిల్లీ నుంచి వియత్నాం ప్రయాణించనుంది. ప్రయాణ సమయం 5 గంటలు పట్టొచ్చు. ప్రతి రోజూ విమానాలు నడుపుతామని కంపెనీ తెలిపింది.
కంపెనీ కార్యకలాపాల ప్రారంభం సందర్భంగా ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. 3 రోజుల సేల్ ప్రకటించింది. ఆగస్ట్ 20 నుంచి 22 వరకు అందుబాటులో ఉండనున్న ఈ సేల్లో భాగంగా కేవలం రూ.9 ప్రారంభ ధరతో టికెట్లు పొందొంచ్చని కంపెనీ తెలిపింది. ఇది కేవలం బేస్ ఫేర్ మాత్రమే. అంటే ఇతర పన్నులు అదనం. అన్నీ కలుపుకుంటే టికెట్ కొనుగోలు చేయాలంటే ప్రారంభ ధర రూ.8,863గా ఉంది.
వియత్ ఎయిర్లైన్స్ ప్రతి ఏడాది క్యాలెంటర్ను విడుదల చేస్తుంది. ఇందులో బికినీ భామలు ఉంటారు. కంపెనీ ఇతర ప్రమోషనల్ యాక్టివిటీస్లోనూ వీరే ఎక్కువగా కనిపిస్తుంటారు. అందువల్ల ఈ ఎయిర్లైన్స్కు బికినీ ఎయిర్లైన్స్ అనే పేరుంది.