యాప్నగరం

దీపావళికి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. ఎంతమేర తగ్గాయంటే?

బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కొనుగోళ్లపై ధన త్రయోదశి ప్రభావం స్పష్టంగా కనిపించింది.

Samayam Telugu 7 Nov 2018, 6:41 am
రెండు రోజుల వరస వృద్ధి తర్వాత బంగారం, వెండి ధరలు మంగళవారం (నవంబరు 6) స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం రూ. 80 తగ్గి 32,610 రూపాయల వద్ద స్థిరపడింది. అదేవిధంగా కిలోగ్రామ్ వెండి 240 రూపాయలు తగ్గి రూ. 39,300 వద్ద స్థిరపడింది. అయితే.. ధన త్రయోదశి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి కొనుగోళ్లు భారీగా జరిగాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా రిటైల్ వ్యాపారులు బంగారం, వెండిని పెద్ద మొత్తంలో విక్రయించారు. అయితే.. సోమవారం ధన త్రయోదశి ముగియడంతో కొనుగోళ్లు తగ్గి వీటి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. దీంతో ఈ దీపావళికి బంగారం, వెండి ధరలు తగ్గినట్టయింది.
Samayam Telugu gold


దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 99.9%, 99.5% పసిడి ధరలు రూ. 80 చొప్పున తగ్గి వరసగా రూ. 32,610, రూ. 32,460 వద్ద స్థిరపడ్డాయి. కిలోగ్రామ్ వెండి రూ. 240 తగ్గి రూ. 39,300 వద్ద స్థిరపడింది. మరింత తగ్గే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరల్లో పెద్దగా మార్పు చోటుచేసుకోకపోవడం గమనార్హం.

ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ. 24,900 వద్దే కొనసాగుతోంది. వారాంతపు ఆధారిత డెలివరీ వెండి ధర రూ. 193 తగ్గి రూ. 38,444 వద్ద స్థిరపడింది.

రిటెయిలర్లు, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడం.. బంగారు కొనుగోళ్లు ఊపందుకోవడంతో రెండు రోజులుగా దేశీయంగా బంగారం ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలో సోమవారం పసిది ధర రూ.40 పెరగడంతో.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,690కు; 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,540కు చేరుకున్నాయి. అంతకు ముందు ట్రేడింగ్‌ (శనివారం)లో బంగారం ధర రూ.20 పెరిగిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.