యాప్నగరం

Gold Hallmark: బంగారం విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం.. వారికి జూన్ వరకు అవకాశం!

Gold Hallmark: బంగారు ఆభరణాల స్వచ్ఛతపై వినియోగదారులు మోసపోకుండా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆరు అంకెల హాల్‌మార్కింగ్ లేని నగలను విక్రయించకూడదని స్పష్టం చేసింది. అయితే, ఈ క్రమంలో బంగారం వ్యాపారుల నుంచి వచ్చిన వినతుల మేరకు నగల విక్రయాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అలాంటి నగలను జూన్ చివరి వరకు విక్రయించుకోవచ్చని తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 4 Apr 2023, 10:19 am
Gold Hallmark: బంగారు నగల స్వచ్ఛత విషయంలో భరోసా కల్పించేందుకు కొత్త ఆర్థిక ఏడాది 2023-24 తొలి రోజు నుంచే కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. బంగారు ఆభరణాలు కొనుగోలులో జరిగే మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రతి నగపై తప్పనిసరిగా 6 అంకెల ఆల్ఫాన్యూమెరిక్ నంబర్ ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ హాల్ మార్కింగ్ నంబర్ లేని వాటిని విక్రయించకూడదని తెలిపింది. అయితే, 2021, జులైకి ముందు తయారు చేసిన ఆభరణాలను విక్రయించడంలో బంగారు డీలర్లకు కష్టతరంగా మారింది. వారి ఆందోళనలు, వినతలును దృష్టిలో పెట్టుకుని కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం వ్యాపారులకు ఊరట కలిగించేలా ప్రకటన చేసింది. ఆల్ఫాన్యూమెరిక్ నంబర్ కాకుండా గతంలో ఇచ్చిన హాల్ మార్క్ ఉన్న పాత బంగారు ఆభరణాలను (Old Gold Hallmarked Stock) విక్రయించేందుకు అవకాశం కల్పించింది. దేశంలోని 16 వేల మంది వ్యాపారులు ఆయా నగలను జూన్ చివరి వరకు విక్రయించేందుకు వీలు కల్పించింది.
Samayam Telugu Gold Hallmark


ఈ మేరకు కొత్త నిబంధనలు అమలులోకి వచ్చే ఒక రోజు ముందే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. జువెలరీ, ఎక్స్‌పర్ట్ బాడీస్‌తో సమావేశం అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది కన్జ్యూమర్ ఎఫేర్ మినిస్ట్రీ. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. హాల్‌మార్కింగ్ గోల్డ్ జువెలరీ అండ్ గోల్డ్ ఆర్ట్‌ఫాక్స్ట్ ఆర్డర్ 2020కి పలు సవరణలు చేసింది. అయితే, పాత హాల్ మార్క్ కలిగిన నగలు ఉన్నట్లు నిర్ణయించిన బంగారం వ్యాపారులు మాత్రమే పాత నగలను జూన్ 30, 2023 వరకు విక్రయించేందుకు అనుమతించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ 2016 సెక్షన్ 18లోని సబ్ సెక్షన్ 4 ప్రకారం ఎవరి వద్ద అయితే జులై 1, 2021 కన్నా ముందు తయారు చేసి పాత హాల్ మార్క్ వేసి ఉన్నట్లు వెల్లడించారో వారు జూన్ 30 వరకు వాటిని విక్రయించుకోవచ్చని స్పష్టం చేసింది కేంద్రం.

దేశంలో మొత్తం 1.56 లక్షల మంది బంగారం డీలర్లు, నగల వ్యాపారులు ఉన్నట్లు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. ఇందులో 16, 243 మంది మాత్రమే కొత్త రూల్స్ వల్ల వచ్చే ఇబ్బందులను లేవనెత్తారు. దీంతో వారికి మాత్రమే మరో మూడు నెలలు గడువు పొడిగించారు. ఆ తర్వాత మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పారు.

ఏప్రిల్ 1 నుంచి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్ మార్క్ వేసిన బంగారు ఆభరణాలపై 6 అంకెల ఆల్ఫాన్యూమెరిక్ హెచ్‌యూఐడీ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. గతంలో 4,6 అంకెల హాల్ మార్క్ నగలు మార్కెట్లో విక్రయించారు. అయితే, అది విక్రయదారుల నిర్ణయంపై ఆధారపడి ఉండేది. కానీ, వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ఏడాది నుంచి తప్పనిసరి చేశారు.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.