యాప్నగరం

Gold Rates: ద్రవ్యోల్బణం దిగొస్తుంది.. బంగారం కొండెక్కుతోంది.. 3 నెలల గరిష్టానికి పసిడి!

Gold Rates: అంచనాల కంటే అమెరికా ద్రవ్యోల్బణం తగ్గడంతో.. బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. భారత్‌లో బంగారం ధరలు 3 నెలల గరిష్టానికి ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు బలపడుతుండటంతో.. మన దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో కూడా ధరలు పెరుగుతున్నాయి.

Authored byKoteru Sravani | Samayam Telugu 14 Nov 2022, 5:15 pm
Gold Rates: ధరలు దిగొస్తున్నాయి. ఇన్ని రోజులు ఆకాశాన్న కూర్చుని ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. ఇటు దేశీయంగా, అటు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం రేట్లు తగ్గాయి. దేశీయంగా టోకు ధరల సూచీ అయిన డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం(WPI inflation) రెండంకెల స్థాయి నుంచి పడిపోయింది. సెప్టెంబర్ నెలలో ఈ రేటు 10.7 శాతంగా ఉంటే.. ఈ రేటు అక్టోబర్‌లో 8.39 శాతానికి శాంతించింది. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 7 శాతం దిగువకు పడిపోవచ్చని అంచనాలున్నాయి. అటు అగ్రరాజ్యం అమెరికాలో కూడా అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం 7.7 శాతానికి తగ్గిపోయింది. అంచనాల కంటే అమెరికా ద్రవ్యోల్బణం తగ్గడంతో.. బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. భారత్‌లో బంగారం ధరలు 3 నెలల గరిష్టానికి ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు బలపడుతుండటంతో.. మన దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో కూడా ధరలు పెరుగుతున్నాయి.
Samayam Telugu Gold Jewellery


మల్టి కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.5 శాతం పెరిగి 10 గ్రాముల రేటు రూ.52,601గా నమోదైంది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా 1 శాతం జంప్ చేసి కేజీ రూ.62,212గా రికార్డయింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు మూడు నెలల గరిష్టానికి పెరిగి.. ప్రస్తుతం కాస్త తగ్గాయి. ఔన్స్ 1,760 డాలర్ల వద్ద నమోదవుతున్నాయి. గత వారం ఈ యెల్లో మెటల్ అత్యధికంగా లాభపడింది. మార్చి 2020 చివరి వారం నుంచి అత్యంత ఎక్కువగా లాభపడింది గత వారంలోనే. అమెరికా ద్రవ్యోల్బణం తగ్గిందనే వార్తలతో పాటు.. వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఫెడరల్ రిజర్వు కాస్త సరళతరం వ్యవహరిస్తుందనే ఆశలతో బంగారం ధరలకు ఊపు వచ్చింది. దీంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగొచ్చాయి.

Also Read : రూ.33,999కే గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్.. చౌకగా ఇలా కొనేసుకోండి!
గత వారం డాలర్ ఇండెక్స్ మూడు నెలల కనిష్టానికి పడిపోయింది. అలాగే అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ కూడా నెల కనిష్టాలకు పడిపోయాయి. అమెరికా వడ్డీ రేట్లు పెరుగుతున్న సమయంలో.. బంగారం తీవ్ర ఒడుదుడుకులకు గురైంది. ఆ సమయంలో ధరలు దారుణంగా పడిపోయాయి. కానీ ప్రస్తుతం ధరలు దిగొస్తుండటంతో.. బంగారం కోలుకుంటోంది. గత వారం కామెక్స్ గోల్డ్ 5.54 శాతం పెరిగి ఔన్స్ 1,769.4 డాలర్ల వద్ద క్లోజైంది. బంగారం ధరలు పెరుగుతుండటంతో.. ఎస్‌పీడీఆర్ గోల్డ్ ఈటీఎఫ్ హోల్డింగ్స్‌కి ఇన్‌ఫ్లోస్‌ కూడా పెరుగుతున్నట్టు కొటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ రవీంద్ర రావు తెలిపారు.

స్వల్పకాలంలో బంగారం ధరలు మరింత పెరుగుతాయని తెలుస్తోంది. తగ్గుతున్న అమెరికా ద్రవ్యోల్బణమే ఈ పెరుగుదలకు సహకరిస్తుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే బంగారానికి అతిపెద్ద వినియోగదారులైన చైనా, భారత్‌లో కూడా డిమాండ్ పెరగడం ధరలు పెరుగుదలకు దోహదం చేస్తుందని చెబుతున్నారు. దేశీయంగా ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో.. బంగారానికి డిమాండ్ పెరిగింది.

Also Read : 4 నెలల చిన్నారి కోసం సిప్.. యంగ్ సీఈవో చెబుతున్న చక్కటి సూత్రాలివే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.