యాప్నగరం

నేడే విడుదల.. అర్ధరాత్రి ‘జీఎస్టీ’ సంబరం

ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం ప్రారంభోత్సవానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్ సిద్ధమవుతోంది.

TNN 30 Jun 2017, 12:04 pm
ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం ప్రారంభోత్సవానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్ సిద్ధమవుతోంది. శుక్రవారం అర్ధరాత్రి జీఎస్టీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అర్ధరాత్రి ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో 1947లో స్వాతంత్ర్యం ప్రకటించినపుడు, ఆ తరవాత 1972లో స్వాతంత్య్ర దినోత్సవ రజతోత్సవాలకు, 1997లో స్వాతంత్య్ర స్వర్ణోత్సావాలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికైంది. ఈ మూడు కార్యక్రమాలు అర్ధరాత్రే జరిగాయి.. ఇప్పుడు మళ్లీ జీఎస్టీని అర్ధరాత్రి ప్రారంభిస్తున్నారు.
Samayam Telugu gst the game changer of indian economy is going to happens today
నేడే విడుదల.. అర్ధరాత్రి ‘జీఎస్టీ’ సంబరం


ఈ చరిత్రాత్మక వేడుకకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. అలాగే మాజీ ప్రధాని హెచ్‌డీ దేవే గౌడ కూడా హాజరవుతున్నారు. మొదట్లో మన్మోహన్ సింగ్ హాజరవుతారని అనుకున్నారు.. కానీ జీఎస్టీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం వల్ల ఆయన రావడంలేదు. అలాగే లెఫ్ట్, తృణమూల్ కాంగ్రెస్ కూడా జీఎస్టీ వేడుకకు డుమ్మా కొడుతున్నాయి.

రాత్రి 10.45 కి ప్రారంభం
జీఎస్టీ ఆవిష్కరణ వేడుక రాత్రి 10.45 గంటలకు ప్రారంభమవుతుంది. మొదట 10 నిమిషాలు జీఎస్టీ గురించి వీడియో షో ఉంటుంది. ఆ తరవాత ఆర్థక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. అనంతరం రాష్ట్రపతి, ప్రధాన మంత్రి 25 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. సరిగ్గా అర్ధరాత్రి జీఎస్టీ విధానాన్ని ఆవిష్కరిస్తారు.

హాజరవుతున్న అతిథులు
ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో పాటు మాజీ గవర్నర్లు బీమల్ జలాన్ , వై.వి. రెడ్డి, డి. సుబ్బారావు జీఎస్టీ వేడుకకు హాజరవుతున్నారు. అయితే రఘురాం రాజన్ అతిథుల జాబితాలో లేరు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) శశికాంత్ శర్మ, మాజీలు వినోద్ రాయ్, టి.ఎన్. చతుర్వేది, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కె.వి. చౌదరి, ప్రధాన ఎన్నికల కమిషనర్ నజీం జైదీతో పాటు ఇతర ముగ్గురు కమిషనర్లు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, మెట్రో మ్యాన్ ఇ. శ్రీధరన్, ఎడిటర్ ఎస్. గురుమూర్తి, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ తదితరులు పాల్గొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.