యాప్నగరం

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏడాది తర్వాత తొలిసారి

Petrol price Cut: పెట్రోల్, డీజిల్ ధరలు తొలిసారిగా దిగొచ్చాయి. ఏడాది కాలంగా పెరుగుతున్న ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. రానున్న రోజుల్లో మరింత తగ్గుతాయేమోనని వాహనదారులు భావిస్తున్నారు.

Samayam Telugu 24 Mar 2021, 6:27 pm
వాహనదారులకు గుడ్ న్యూస్. ఏడాది కాలంగా అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తొలిసారిగా కాస్త తగ్గాయి. దేశీయ చమురు సంస్థలు బుధవారం (మార్చి 24) లీటర్‌ పెట్రోల్‌ 18 పైసలు, డీజిల్‌పై 17 పైసలు తగ్గించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Samayam Telugu పెట్రోల్
Petrol Price Cut


లీటర్ పెట్రోల్ ధర దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 100 రూపాయల మార్కును అందుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ధరలను తగ్గించడానికి కేంద్రం ప్రభుత్వం ఏవైనా చర్యలు చేపడుతుందని ఎదురుచూసిన వాహనదారులకు నిరాశే ఎదురైంది. ఇంధన విక్రయాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ఆలోచన కూడా లేనట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో సామాన్యుడిలో అసహనం నెలకొంది.

ఇలాంటి తరుణంలో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశమే. రానున్న రోజుల్లో మరి కొంత తగ్గవచ్చని వాహనదారులు భావిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇదే తొలి తగ్గుదల కావడం గమనార్హం. అంతేకాదు, గతేడాది మార్చి 16 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి. ఏడాది కాలంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. పెట్రోల్‌పై రూ.21.58, డీజిల్‌పై రూ.19.18 పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 నుంచి 18 పైసలు తగ్గి రూ.90.99కి చేరింది. డీజిల్‌ ధర రూ.81.47 నుంచి 17 పైసలు తగ్గి రూ.81.30కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.40, డీజిల్‌ ధర రూ.88.42గా నమోదైంది. ఇటు హైదరబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.61కు, డీజిల్‌ ధర రూ.88.67కు చేరుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.