యాప్నగరం

Telangana Elections: ఎన్నికలు ముగిశాక.. పెట్రోల్ ధరలు పెరుగుతాయా? పోల్స్‌కు పెట్రోల్‌ ధరలకు సంబంధం ఏంటి?

గత కొద్ది రోజులుగా తగ్గిన పెట్రోలో ధరలు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తిరిగి పెరగనున్నాయా? గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో.. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల సమయంలోనూ ఇలాగే జరిగింది.

Samayam Telugu 6 Dec 2018, 11:53 am
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోన్న పెట్రోల్ ధరలు ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మళ్లీ పెరగనున్నాయా? పెట్రో ఉత్పత్తుల ధరలకు, ఎన్నికలకు అవినాభావ సంబంధం ఉందని భావించొచ్చు. ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. కర్ణాటక ఎన్నికల ముందు 20 రోజులపాటు పెట్రోల్ ధరలు పెరగలేదు. మే 12న ఎన్నికలు ముగిశాక 17 రోజుల్లోనే పెట్రోల్ ధర సుమారు నాలుగు రూపాయల మేర పెరిగింది. గత ఏడాది జనవరి 16 నుంచి ఏప్రిల్ 1 మధ్య పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అప్పట్లో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, యూపీ, మణిపూర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. దీన్ని బట్టి ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గడం, తర్వాత పెరగడం అనేది ఓ ట్రెండ్‌గా మారిందని అర్థం అవుతోంది.
Samayam Telugu polls petrol


తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. నిరసనలు వ్యక్తం కావడంతో.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని రూ.1.50 మేర తగ్గించింది. లీటర్‌కు రూ.1 తగ్గించాలని తగ్గించాలని చమురు సంస్థలను కోరింది. తర్వాత అక్టోబర్ 18 నుంచి చమురు ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.

గత రెండు నెలలుగా అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు 30 శాతం తగ్గాయి. దీంతో చమురు ఉత్పత్తిని తగ్గించే దిశగా ఒపెక్ దేశాలు యోచిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, రష్యా, సౌదీల చమురు ఉత్పత్తి ఆల్ టైం హైకి చేరింది. ఒకవేళ ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గిస్తే దాని ప్రభావం ధరలపై పడనుంది.

ఇటీవల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా లేదు. నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు ఆశాజనకంగా లేవు. ఏడాది మొత్తంలో జీఎస్టీల వసూళ్లు అంచనా కంటే రూ.50 వేల కోట్లు తగ్గుతాయని అంచనా. ద్రవ్యలోటు కూడా ఎక్కువగానే ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఖజానాను నింపుకోవాలనుకున్న కేంద్ర సర్కారు.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దీంతో కేంద్రానికి పెట్రోల్ ఉత్పత్తులపై పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కీలకం కానుంది.

ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరిగితే మరోసారి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి సామాన్యుడిపై పెట్రో భారాన్ని తగ్గించే దిశగా కేంద్రం అడుగేయలేకపోవచ్చు. అదే జరిగితే పెట్రోల్ ధరలు పెరుగుతాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.