యాప్నగరం

నీట్, జేఈఈ పరీక్షలు ఇక ఏడాదికి రెండుసార్లు: జవదేకర్

నీట్, జేఈఈ, నెట్ పరీక్షల కొత్త షెడ్యూలును కేంద్రం శనివారం (జులై 7) విడుదల చేసింది. కొత్త షెడ్యూలు ప్రకారం.. ఇకనుంచి ఏడాదికి రెండుసార్లు జేఈఈ (మెయిన్), నీట్ పరీక్షలను నిర్వహించననున్నారు.

Samayam Telugu 7 Jul 2018, 5:24 pm
నీట్, జేఈఈ, నెట్ పరీక్షల కొత్త షెడ్యూలును కేంద్రం శనివారం (జులై 7) విడుదల చేసింది. కొత్త షెడ్యూలు ప్రకారం.. ఇకనుంచి ఏడాదికి రెండుసార్లు జేఈఈ (మెయిన్), నీట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు 'సీబీఎస్‌ఈ' నిర్వహిస్తున్న ఈ పరీక్షలను ఇకనుంచి 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)' నిర్వహించనుంది. ఈ విషయాన్ని కేంద్ర హెచ్‌ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Samayam Telugu prakash


కొత్త షెడ్యూలు ప్రకారం.. నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను డిసెంబర్‌లో, జేఈఈ మెయిన్స్‌ను జనవరి, ఏప్రిల్ నెలల్లో; నీట్‌ను ఫిబ్రవరి, మే నెలల్లో నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని పరీక్షలను ఆన్‌లైన్ విధానంలోనే చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరీక్షలకు విద్యార్థులు రెండు సార్లూ లేదంటే ఏదైనా ఒకసారి హాజరుకావొచ్చని తెలిపారు. ఎక్కువ మార్కులు వచ్చిన పరీక్షను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన అన్నారు.

ప్రతి పరీక్షను నాలుగు లేదా అయిదు తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. సిలబస్‌, ప్రశ్నల ఫార్మాట్‌, భాష, ఫీజుల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తామని, విద్యార్థులు ఇళ్లలో లేదా అధికారికంగా గుర్తించిన కంప్యూటర్‌ సెంటర్లలో ఉచితంగా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చని జవదేకర్‌ సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన కంప్యూటర్ సెంటర్ల వివరాలను త్వరలో వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.

జీప్యాట్, సీమ్యాట్ పరీక్షలను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారానే నిర్వహించనున్నట్లు జవదేకర్ తెలిపారు. పరీక్షలో విద్యార్థులకిచ్చే ప్రశ్నపత్రాలు ఒకే విధంగా ఉండవని.. ఒక్కో విద్యార్థికి ఒక్కో రకమైన ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉంటుందన్నారు. వివిధ విభాగాలకు చెందిన నిపుణులు, విద్యావేత్తలు ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలు రూపొందిస్తారని ఆయన అన్నారు. ఆన్‌లైన్ పరీక్షల కోసం అత్యున్నత భద్రత ప్రమాణాలతో కూడిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నామని.. దీనిద్వారా ఎలాంటి లీకేజీలకు అవకాశముండదని జవదేకర్ తెలిపారు.

పరీక్షల షెడ్యూలు ఇలా...
* నెట్ నిర్వహణకు సంబంధించి ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. పరీక్షలను డిసెంబరు 2 నుంచి 16 వరకు నిర్వహిస్తారు .
* జేఈఈ (మెయిన్)కు సంబంధించి సెప్టెంబరు 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 2019 జనవరిలో పరీక్ష నిర్వహించి.. ఫిబ్రవరి మొదటివారంలో ఫలితాలు వెల్లడిస్తారు.
* ఇక నీట్ పరీక్షలకు అక్టోబరు 1 నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 2019 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.