యాప్నగరం

Narasaraopet: హైడ్రామాకు తెర.. రాయపాటికే నర్సరావుపేట టిక్కెట్!

నరసరావుపేట లోక్‌సభ టిక్కెట్ విషయంలో గురువారం ఉదయం నుంచి అనూహ్య పరిణామాలు చోటుచేసుకోగా, ఈ సీటును సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావుకే చంద్రబాబు కేటాయించారు.

Samayam Telugu 15 Mar 2019, 9:11 am
నరసరావుపేట లోక్‌సభ టిక్కెట్ విషయంలో తలెత్తిన ఉత్కంఠకు తెరపడింది. ఈ సీటును సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావుకే చంద్రబాబు కేటాయించారు. నర్సారావుపేట విషయంలో గురువారం ఉదయం నుంచి అనూహ్య పరిణామాలు చోటుచేసుకోగా, ఒకదశలో రాయపాటి పార్టీ మారుతారంటూ ప్రచారం సాగింది. అయితే, దీనికి చంద్రబాబు పుల్‌స్టాప్ పెట్టారు. ఈ సీటును తన తండ్రికే ఖరారుచేసినట్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారని రాయపాటి తనయుడు రంగారావు వెల్లడించారు. దీంతో ఊహాగానాలకు తెరపడింది. నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థి విషయంలో మూడు రోజులుగా కసరత్తు చేస్తున్నా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో భాష్యం విద్యా సంస్థల అధినేత పేరు తెరపైకి రావడంతో రాయపాటి ఒకింత అసంతృప్తికి గురయ్యారు.
Samayam Telugu rayapati


దీంతో టీడీపీ నేతలను బాబు రంగంలోకి దింపారు. సుజనా చౌదరి, టీడీ జనార్దన్‌, మంత్రులు పుల్లారావు, నారా లోకేశ్‌ ఆయనతో వేర్వేరుగా మాట్లాడారు. గుంటూరు జిల్లా అధినేత జీవీఎస్‌ ఆంజనేయులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. తర్వాత తెనాలి ఎమ్మెల్యే ఆలపాటితో కలిసి రాయపాటి ఇంటికి వెళ్లి నరసరావుపేట లోక్‌సభ సీటు ఆయనకే ఖరారైందని తెలిపారు.

అంతకు ముందు రాయపాటి ఇంటికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకోగా వారితో సమావేశమైన ఆయన సమాలోచనలు సాగించారు. అవసరమైతే పార్టీ మారాలనే డిమాండు కూడా చేశారు. అయితే, ఈలోగా టీడీపీ నేతలు చర్చలు జరపడంతో వివాదానికి తెరపడింది. రాయపాటి తనయుడు రంగారావు మాట్లాడుతూ... లోక్‌సభ స్థానం తన తండ్రికే కేటాయించడంతోపాటు నరసరావుపేట అసెంబ్లీ సీటును కూడా తాము సూచించిన అభ్యర్థికే ఇస్తామన్నారని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.