యాప్నగరం

AP Elections: మంగళగిరిలో మొరాయించిన 40 శాతం ఈవీఎంలు.. సీపీఐ అభ్యర్థి నిరసన

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 800 ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓటింగ్ ప్రారంభమై మూడు గంటలు పూర్తయినా కొన్నిచోట్ల ఈవీఎంలు ఇంకా మొరాయిస్తున్నాయి.

Samayam Telugu 11 Apr 2019, 10:34 am
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలకు పోలింగ్ మొదలైనా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు క్యూలో వేచిచూస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా 800 ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓటింగ్ ప్రారంభమై మూడు గంటలు పూర్తయినా కొన్నిచోట్ల ఈవీఎంలు ఇంకా మొరాయిస్తున్నాయి. దీంతో ఎన్నికల సిబ్బంది చేతులేత్తేసింది. సాంకేతిక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మొరాయించిన ఈవీఎంలను అధికారులు సరిచేయలేకపోతున్నారు. అధికారుల తీరుపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu muppalla.


ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 40 శాతం ఈవీఎంలు పనిచేయడంలేదు. దీంతో ఇక్కడ నుంచి సీపీఐ తరఫున పోటీలో ఉన్న ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి ఆయన నిరసన చేపట్టారు. విజయవాడలో మొగలిరాజపురంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు పోలింగ్ బూత్‌కు తాళం వేశారు. దాదాపు ఏపీ వ్యాప్తంగా 30 శాతం ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఎన్నికల సంఘం తీరుపై ఓటర్లు మండిపడుతున్నారు.

ఈసీ తీరుపై అటు సామాన్యులు, ఇటు రాజకీయ పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. సాక్షాత్తూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు హక్కు వేయడానికి వెళ్లిన చోటే వీవీప్యాట్‌ మొరాయించడం గమనార్హం. ఎలక్షన్ కమిషన్ అధికారులు ప్రచార ఆర్భాటాలు తప్పా, పోలింగ్ రోజున ఆచరణ సక్రమంగా లేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం జిల్లా పరిషత్తు ఉన్న పాఠశాలల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం 7 గంటలకే ఆయన చేరుకున్నారు. ఈవీఎం మొరాయించడంతో అరగంట సేపు బయటే వేచి ఉండాల్సి వచ్చింది.

ఈవీఎంల పనిచేయకపోవడంపై విశాఖ పార్లమెంటు జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏయూ పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 227లో ఉదయం 8.20 గంటలైనా పోలింగ్‌ ప్రారంభం కాలేదని, ఉదయం 6.45 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారని, సరైన సమాధానం ఎవరూ ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. పోలింగ్‌ నిర్వహణ అధ్వానంగా ఉందని దుయ్యబట్టారు. బద్వేల్‌ నియోజకవర్గం కాశీనాయన మండలం గొంటువారిపల్లె 97వ బూత్‌లో వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. పోలింగ్‌ బూత్‌ తలుపులు మూసేసి, ఓటర్లను వెనక్కి పంపేశారని అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.