యాప్నగరం

YSRCPలోకి కొణతాల రామకృష్ణ?

మాజీ మంత్రి వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌పై టీడీపీ హామీ ఇవ్వకపోవడంతో చివరకు వైసీపీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Samayam Telugu 15 Mar 2019, 9:42 am
మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ మళ్లీ వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన టీడీపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసి అనకాపల్లి నుంచి లోక్‌సభ టిక్కెట్ కోరినట్లు సమాచారం. అయితే విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌ పేరును ఇటీవల టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో ఆ పార్టీలో చేరాలన్న నిర్ణయాన్ని ఆయన ఆఖరి నిమిషంలో విరమించుకున్నట్లు సమాచారం.
Samayam Telugu Konathala-RamaKrishna


గురువారం అనకాపల్లిలో తన అనుచరులలో సమావేశం నిర్వహించిన కొణతాల అందరి అభిప్రాయాల మేరకే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కొణతాల వైసీపీలోనే ఉన్నారు. విశాఖ పార్లమెంటు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆయన తమ్ముడు కొణతాల రఘునాథ్‌ను అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేశారు. విశాఖ ఎంపీగా పోటీకి దిగిన వైఎస్‌ విజయమ్మ ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో విజయమ్మ 90 వేల ఓట్ల తేడాతోనూ, అనకాపల్లిలో రఘునాథ్‌ 22 వేల ఓట్ల తేడాతోనూ ఓడిపోయారు.

కొణతాల సక్రమంగా పనిచేయకపోవడంతోనే రెండుచోట్లా పార్టీ ఓడిపోయిందని వైసీపీ అధిష్ఠానం భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటినుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఇవ్వలేమని, రాజ్యసభకు పంపిస్తామని చంద్రబాబు చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. దీంతో వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం జగన్‌ కలిసేందుకు హైదరాబాద్ వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందడంతో ఆయన చేరిక ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.