యాప్నగరం

పోలింగ్ ముగిసినా జనం మధ్యే.. ప్రత్యేకత చాటుకున్న లక్ష్మీనారాయణ

ఎన్నికల ముందు జనం మధ్య కనిపించిన నేతలు.. పోలింగ్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ మాత్రం జనం సమస్యలను తెలుసుకోవడానికి మొగ్గు చూపారు.

Samayam Telugu 12 Apr 2019, 9:31 pm
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రచారం సమయంలో జనం మధ్యే కనిపించిన నేతలు.. ఇప్పుడు ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు ప్రజా సమస్యలను ఎంతో ఓపికగా విన్న నేతలు సైతం.. పోలింగ్ ముగిశాక కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాస్తో కూస్తో సమయాన్ని పోలింగ్ ఎలా జరిగిందో అంచనా వేసేందుకు కేటాయిస్తున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత సాధారణంగా జరిగేది ఇదే. పోలింగ్ ముగిశాక రాజకీయ నాయకులు జనంలోకి వెళ్లడం అరుదు. కానీ జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాత్రం శుక్రవారం జనాల మధ్యన కనిపించారు.
Samayam Telugu jd lakshminarayana.


జేడీ లక్ష్మీనారాయణ స్థానికేతరుడు కావడంతో ఎన్నికల్లో ఓడితే ఆయన విశాఖలోనే ఉంటారా? అని విపక్షాలు ప్రశ్న లేవనెత్తాయి. దీనికి సమాధానం అన్నట్టుగా.. ఏప్రిల్ 12 ఉదయాన్నే ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారులను కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి బాగోగుల కోసం ప్రణాళికను సిద్ధం చేస్తానని తెలిపారు.

విశాఖపట్నం నుంచి ఎంపీ పోటీ చేసిన లక్ష్మీనారాయణ విజయంపై ధీమాగా ఉన్నారని సమాచారం. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే లోగానే.. నియోజకవర్గ పరిధిలోని సమస్యలను తెలుసుకోవాలని, వాటికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారాలను అందించాలని ఆయన భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల హామీలను నెరవేరుస్తానని ఆయన బాండ్ పేపర్ మీద రాసిచ్చిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.