యాప్నగరం

లోకేశ్ కోసం రంగంలోకి దిగిన బ్రాహ్మణి.. మంగళగిరిలో ప్రచారం, ఏం మాట్లాడారంటే?

నారా లోకేశ్ తరఫున ఆయన భార్య బ్రాహ్మణి మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోకేశ్ స్థానిక ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఇక్కడికి 42 కంపెనీలను తీసుకొచ్చారని ఆమె చెప్పారు.

Samayam Telugu 7 Apr 2019, 10:39 pm
మంగళగిరి: ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ.. ఏపీలో పార్టీల ప్రచారం దాదాపు తుది దశకు చేరింది. మరో రెండు రోజులే ప్రచారానికి గడువు ఉండటంతో.. పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తరఫున షర్మిల, విజయమ్మ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ తరఫున కూడా నారా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. చంద్రబాబు, లోకేశ్, నారా రోహిత్ ప్రచారం చేస్తుండగా.. ఆదివారం నందిగామలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు చంద్రబాబు తన కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌లను కూడా తీసుకొచ్చారు. అనంతరం తన భర్త లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగరిలో బ్రాహ్మణి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
Samayam Telugu brahmani


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోకేశ్ స్థానిక ఎమ్మెల్యే కానప్పటికీ మంగళగిరి పరిధిలో 42 కంపెనీలను తీసుకొచ్చారని బ్రాహ్మణి తెలిపారు. వాటి ద్వారా మూడున్నర వేల మందికి ఉపాధి లభించిందన్నారు.

స్థానిక సమస్యలను దృష్టిలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించారని బ్రాహ్మణి తెలిపారు. ఇక్కడి ఎమ్మెల్యే కాకపోయినా ఇంతగా అభివృద్ధి చేసిన లోకేశ్.. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకెంత పని చేస్తారో ఆలోచించాలని ప్రజల్ని కోరారు. వచ్చే ఐదేళ్లలో మరిన్ని కంపెనీలను తీసుకొస్తామని ఆమె తెలిపారు.

మంగళగిరి నియోజకవర్గంలోనే మా ఇల్లు, ఓటు హక్కు ఉన్నాయని బ్రాహ్మణి తెలిపారు. కుప్పం ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఎలాగైతే 24 గంటలూ తమ ఇంటికి వస్తున్నారో.. మంగళగిరి ప్రజలు కూడా రావచ్చని ఆమె చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.