యాప్నగరం

AP Elections: ఏజెన్సీలో ముగిసిన పోలింగ్.. క్యూలో ఉన్నవారికి అవకాశం

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు, పాడేరులో రెండు గంటలు, సాలూరు, కురుపాంలో గంట ముందు పోలింగ్ ముగిసింది.

Samayam Telugu 11 Apr 2019, 4:57 pm
నక్సల్స్ ప్రాబల్యం ఉన్న అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే, ఆ సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటువేసే అవకాశం కల్పించారు. మరోవైపు, ఏజెన్సీ ప్రాంతంలో వర్షం కురవడంతో క్యూలో ఉన్నవారు అవస్థలు పడుతున్నారు. నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరులో 4 గంటలకు, సాలూరు, పార్వతీపురం, కురపాంలో 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.ఇదిలా ఉండగా సాయంత్రం 6గంటల్లోగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన వారందరికీ ఓటు వేసేందుకు అనుమతిస్తున్నామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని ఈవీఎంలపై మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని అన్నారు. ఒకరికి ఓటు వేస్తే ఇంకొకరికి వెళ్తుందనేది కూడా దుష్ప్రచారమేనని, దయచేసి పుకార్లను నమ్మవద్దని ఓటర్లకు ఆయన విఙ్ఞప్తి చేశారు. కొన్నిచోట్ల మాక్‌ పోలింగ్ నిర్వహించిన తర్వాత వచ్చిన ఫలితాలను డిలీట్‌ చేయకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు.
Samayam Telugu vote


కాగా, పోలింగ్ సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చిన ఆయన, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఓటర్లదేనని స్పష్టం చేశారు. ఓటమి భయంతో ఓటింగ్ శాతం తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారని, ప్రజలంతా స్వేచ్ఛగా నిర్భీతిగా ఓటేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఓటింగ్‌ను అడ్డుకోవాలనే వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని, ఓటు వేయకపోతే అరాచకత్వాన్ని ప్రోత్సహించినట్టు అవుతుందని అన్నారు. రాష్ట్రం కోసం ప్రజలు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారని, ఈవీఎంల వైఫల్యంతో విసుగు చెంది వెనక్కి వెళ్లారని అన్నారు. ఈ సందర్భంగా, వెనక్కి వెళ్లిన ఓటర్లను వినమ్రంగా అర్థిస్తున్నా.. రాష్ట్రం కోసం ఈ ఒక్క రోజు కష్టపడండి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

‘దయచేసి మళ్లీ ఓపికగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓట్లు వేయకుండా మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు. ఓట్లు వేయని వాళ్లు సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకోండి. మీరు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తుకు పునాది, భావితరాల భవిష్యత్తు మీ ఓటుపైనే ఆధారపడి ఉంటుంది’ అంటూ ఓటర్లకు సందేశం ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.