యాప్నగరం

ఎల్బీ స్టేడియం సభకు కేసీఆర్ గైర్హాజరు.. కారణం ఇదేనా?

ఎన్నికల ప్రచారంలో భాగం ఎల్బీ స్టేడియంలో జరిగిన సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. అంతకు ముందు మిర్యాలగూడలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్ సభలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.

Samayam Telugu 29 Mar 2019, 10:58 pm
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్.. అక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరి వచ్చారు. షెడ్యూల్ ప్రకారం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సభను నిర్వహించాల్సి ఉంది. కానీ నిర్ణీత టైంలోగా కేసీఆర్ హైదరాబాద్ రాలేకపోయారు.
Samayam Telugu kcr1.


కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో పాల్గొనకపోవడంతో.. ఆయన లేకుండానే మంత్రులు సభను నిర్వహించారు. సీఎం రావట్లేదని తెలియడంతో.. జనం నెమ్మదిగా స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఈ సభలో హోం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
దినపత్రికల్లో ఈ మీటింగ్ గురించి ప్రకటనలు గుప్పించారు. కానీ చివరి నిమిషంలో కేసీఆర్ రాకపోవడం చర్చకు దారి తీసింది. సభకు ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతోనే సీఎం కేసీఆర్ ఈ సభకు హాజరు కాలేదని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. జనం పలుచగా ఉండటంతో.. బాధ్యులపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా ప్రచారం జరిగింది. లోక్ సభ ఎన్నికల ప్రకటన వెలువడ్డాక హైదరాబాద్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన తొలి సభ ఇదే కావడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.