యాప్నగరం

హిందూపురం వైసీపీ అభ్యర్థికి ఏపీ ప్రభుత్వం షాక్

హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన దరఖాస్తు చేసుకున్న వీఆర్ఎస్‌ను ఏపీ పోలీసు శాఖ పెండింగ్‌లో పెట్టడంతో ఆయన పోటీపై నీలినీడలు అలుముకున్నాయి.

Samayam Telugu 20 Mar 2019, 1:50 pm
హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌కి ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. కదిరి సీఐగా పనిచేసిన మాధవ్ రెండు నెలల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకుని జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా జగన్ ఆయనకు హిందూపురం ఎంపీ టిక్కె్ట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసు శాఖ ఆయనకు షాకిచ్చింది. వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకుని రెండు నెలలైనా శాఖాపరంగా ఆమోదించలేదు. దీంతో ఆందోళన చెందుతున్న మాధవ్ హైకోర్టును ఆశ్రయించారు. మాధవ్ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారించనుంది.
Samayam Telugu madhav


ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఓ పార్టీ తరపున పోటీ చేయడంగానీ, ప్రచారం గానీ చేయకూడదు. మాధవ్ వీఆర్ఎస్ ఇంకా ఆమోదం పొందనందున ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు. అయితే తనపై పోలీసులు ఉన్నతాధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాధవ్ ఆరోపిస్తున్నారు. మాధవ్ వ్యవహారం ఎటూ తేలకపోతే ఆయన భార్యను రంగంలోకి దించాలని వైసీపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

2018 సెప్టెంబర్‌లో అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ప్రబోధానంద ఆశ్రమం వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా ఘర్షణలు జరిగాయి. ప్రబోధానం శిష్యులు, స్థానికులు రాళ్ల దాడి కూడా చేసుకున్నారు. ఈ వ్యవహారంలో తలదూర్చిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రబోధానందకు వ్యతిరేకంగా నడిరోడ్డుపై బైఠాయించిన హల్‌చల్ చేశారు. పోలీసులపైనా రుసరుసలాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురం పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఉన్న కదిరి సీఐ గోరంట్ల మాధవ్.. జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పోలీసులను అనవసరంగా విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ మీడియా సాక్షిగా మీసం మెలేసి చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకున్న మాధవ్ వైసీపీలో చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.